'మిస్ ఇండియా' అంటే చాయ్ బ్రాండ్ అని వెల్లడించిన ట్రైలర్!
on Oct 24, 2020
జాతీయ ఉత్తమనటి కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'మిస్ ఇండియా' మూవీ నేరుగా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్పై రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. 'పెంగ్విన్' సినిమా తర్వాత డైరెక్ట్గా ఓటీటీలో విడుదలవుతున్న కీర్తి రెండో సినిమా ఇది. ఈ సినిమా ట్రైలర్ను నెట్ఫ్లిక్స్ శనివారం విడుదల చేసింది. ఫిమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్గా తయారైన ఈ సినిమాలో సంయుక్త అనే క్యారెక్టర్ పోషించింది కీర్తి.
తాను బిజినెస్ చేయడానికే పుట్టానని నమ్మే అమ్మాయి సంయుక్త. కానీ ఆమె డ్రీమ్కు తల్లి అడ్డు చెబుతుంది. తర్వాత పట్టుదలతో చాయ్ బిజినెస్లోకి అడుగుపెడుతుంది సంయుక్త. ఒక కుటుంబం ఆమెకు సపోర్ట్గా నిలుస్తుంది. ఇండియన్ చాయ్ను 'మిస్ ఇండియా' అనే బ్రాండ్ పేరుతో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్పై అమ్మేందుకు అన్ని రకాల ప్లాన్స్ సిద్ధం చేసుకుంటుంది. అన్ని చోట్లా ఉన్నట్లే బిజినెస్ రంగంలోనూ రాబందులు ఉంటాయి. "బిజినెస్ అంటే ఆడపిల్లలు ఆడుకొనే ఆటకాదు.. బిజినెస్ ఈజ్ ఎ వార్" అంటూ ఓ బిజినెస్ టైకూన్ (జగపతిబాబు) ఆమెకు ఆటంకాలు సృష్టిస్తాడు.
సంయుక్త రోల్లో కీర్తి చాలా ప్రామిసింగ్, కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని అన్స్టాపబుల్గా మార్చే అమ్మాయిగా కీర్తి నటనను చూసి తీరాల్సిందే అన్నట్లుంది. ఆమెను బిజినెస్లో పడెయ్యాలని చూసే టైకూన్గా జగపతిబాబు ఎప్పటిలా తనదైన విలనీని ప్రదర్శించనున్నాడని తెలుస్తోంది.
కీర్తి తల్లిగా నదియా నటించిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, నరేశ్, రాజేంద్ర ప్రసాద్, కమల్ కామరాజు ప్రామినెంట్ రోల్స్ చేశారు. నరేంద్రనాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మహేశ్ కోనేరు నిర్మించారు. నవంబర్ 4న నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్లు ట్రైలర్ ధ్రువీకరించింది.
Also Read