అభిమానులకు డబుల్ బొనాంజా
on Aug 17, 2017
చడీచప్పుడు కాకుండా... కుటుంబ సభ్యుల సమక్షంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం పూజా కార్యక్రమాన్ని ‘మమ’ అనిపించేశారు మెగాస్టార్. ఎప్పుడెప్పుడా అని అత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులందరికీ దీంతో స్వీట్ షాక్ తగిలినట్టయ్యింది. ఏది ఏమైనా... ఇలా హంగామా హడావిడీ లేకుండా మెగా సినిమాకు కొబ్బరికాయ కొట్టేయడం చాలామంది అభిమానులకు నచ్చలేదు. అందుకే... ఆ బాధను పోగొట్టడానికీ... వారిలో జోష్ నింపడానికి ‘డబుల్ బొనాంజా’ ఇవ్వాలని నిశ్చయించాడు చిత్ర నిర్మాత రామ్ చరణ్. మెగాస్టార్ పుట్టిన రోజైన ఈ నెల 22న ఆ డబుల్ బోనాంజా అభిమానులకు అందనుంది. ఇంతకీ ఏంటా బొనాంజా అనుకుంటున్నారా? ఈ విషయం చెప్పేముందు మరో విషయం గురించి వివరణ ఇవ్వాలి. అదేంటంటే?
స్వాతంత్ర్య సమరానికి నాంది పలికిన తొలి భారతీయ యోధుడు.. తెలుగువాడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి తెరరూపం ఈ సినిమా. ఇదొక బయోపిక్. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా అన్ని భాషలకూ సరిపోయే విధంగా ఈ సినిమాకు ‘మహావీర’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఏ విషయం ఒకట్రెండు రోజుల్లో తేలిపోతుంది.
ఇదిలావుంటే... టైటిల్ ని త్వరగా నిర్ణయించి... మెగాస్టార్ పుట్టిన రోజైన ఆగస్ట్ 22న ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేయనున్నారు. దీనితో పాటు యానిమేషన్ తో కూడిన మోషన్ పోస్టర్ ని కూడా అదే రోజున ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదల చేయాలని రామ్ చరణ్ సంకల్పించాడు. మోషన్ పోస్టర్ కి సంబంధించిన యానిమేషన్ వర్క్ ఇప్పటికే మొదలైంది.
అంటే... రాబోతున్న మెగాస్టార్ పుట్టిన రోజును... అభిమానులు ఓ పండుగలా జరుపుకోడానికి కావల్సినంత స్టఫ్ ఇచ్చేశాడనమాట చరణ్. ఇక పండగే పండగ.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయనున్నారు.