తారక్ ఔట్.. మహేశ్ ఇన్!
on Feb 6, 2020
సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు హీరోగా పరిచయమవుతున్న 'ఓ పిట్ట కథ' టీజర్ను శుక్రవారం (ఫిబ్రవరి 7) సాయంత్రం 5.05 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ రిలీజ్ చేస్తారని ఆ చిత్ర నిర్మాణ సంస్థ భవ్యా క్రియేషన్స్ ప్రకటించింది. చెందు ముద్దు డైరెక్టర్గా పరిచయమవుతున్న ఈ సినిమాలో విశ్వంత్ దుద్దుంపూడి మరో హీరోగా నటిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ, ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఒక ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమంటే వాస్తవానికి ఫిబ్రవరి 7న ఈ సినిమా టీజర్ను జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించాల్సి ఉంది. ఫిబ్రవరి 3న బ్రహ్మాజీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన పోస్ట్ చూస్తే ఆ విషయమే తెలుస్తుంది. "ఓ పిట్ట కథ.. కానీ మా టీం ను 'బిగ్ స్టార్' ఆశీర్వదించబోతున్నారు' అని ఆయన ట్వీట్ చేశారు. దాంతో పాటు 'ఊహించండి' బ్లర్ చేసిన ఆ బిగ్ స్టార్ ఇమేజ్ను పోస్ట్ చేశాడు. అందులోని స్టార్ బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నట్లు, వెనుక ఓ కారు ఉన్నట్లు కనిపిస్తోంది. పరిశీలనగా చూస్తే అది జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ అని తెలిసిపోతుంది. తారక్ ఫ్యాన్స్ కూడా బ్లర్ చేసిన ఆ ఇమేజ్ ఒరిజినల్ను గుర్తించి, తమ సోషల్ మీడియా ప్లాట్ఫాంస్ మీద షేర్ చేశారు. అయితే సీన్ కట్ చేస్తే.. తారక్ ప్లేస్లో మహేశ్ వచ్చాడు. దాంతో తారక్ ఫ్యాన్స్ను మహేశ్ ఫ్యాన్స్ ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. తారక్ ఫ్యాన్స్కైతే ఈ మార్పు ఎందుకు జరిగిందో తెలీక అయోమయానికి గురయ్యారు. బ్రహ్మాజీని వారు ట్రోల్ చేస్తున్నారు. బ్రహ్మాజీకి కూడా ఈ మార్పు రుచించలేదో, ఏమో.. టీజర్ను మహేశ్ లాంచ్ చేస్తున్న విషయాన్ని ఇంతదాకా తన ట్విట్టర్ పేజీలో షేర్ చెయ్యలేదు.
తెలుగుఒన్కు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ను తారక్ రిలీజ్ చేయనున్నాడు. అందుకే టీజర్ను మహేశ్ చేత లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.