భారత ప్రభుత్వానికి ఎన్టీయార్ టోపి?
on Aug 5, 2017
కోట్లు సంపాదిస్తున్నప్పుడు... దానికి తగ్గట్టు ప్రభుత్వానికి ఇన్ కం ట్యాక్స్ చెల్లించడం అనేది సంపాదించే ప్రతి ఒక్కరి బాధ్యత. దాన్ని విస్మరించడం అనేది గర్హనీయం. ఇప్పటి వరకూ రాజకీయ నాయకులూ, బడా వ్యాపారస్థులు మాత్రమే ప్రభుత్వానికి పన్నుల రూపంలో టోకరా ఇస్తుండటం మనం చూశాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఆ లిస్ట్ లోకి సినిమా వాళ్లు కూడా చేరుతున్నారు.
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీయార్. బాలీవుడ్ లో రణబీర్ కపూర్. వీరిద్దరూ వైట్ మనీ రూపంలో తీసుకున్న పారితోషికాలకు తగ్గట్టు ట్యాక్స్ చెల్లించకుండా మోసం చేయడానికి ప్రయత్నించినట్లు కాగ్ నుంచి అభియోగం. ఇక ఈ వ్యవహారం పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
‘నాన్నకు ప్రేమతో’చిత్ర కథానాయకుడైన ఎన్టీయార్.. లండన్ కు చెందిన వైబ్రంట్ విజువల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 2015లో పారితోషికంగా 7.33 కోట్లు తీసుకున్నట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఎక్స్ పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద పరిగణించి తాను చెల్లించాల్సిన 1.10 కోట్ల సర్వీస్ పన్ను ఎన్టీయార్ మినహాయించాడని కాగ్ వివరించింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ కోరగా.. త్వరలోనే ఎన్టీయార్ కి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు ఆర్థిక శాఖ అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం తెలిపింది.
ఇదే తరహాలో బాలీవుడ్ హీరో రణబీర్ కూడా తాను నటించిన ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమా న్యూయార్క్ లో చిత్రీకరించబడిందని సాక్ష్యాలు చూపిస్తూ... 83.43 లక్షల పన్ను మినహాయింపు పొందిన విషయాన్ని కూడా కాగ్ గుర్తించింది. దీనిపై ఆర్థిక శాఖను వివరణ కోరగా, ఈ సినిమా ఎక్కువ శాతం విదేశాల్లోనే జరిగిందని, దాంతో మినహాయింపు ఇవ్వడం జరిగిందని వివరణ ఇచ్చింది. ఈ విషయంలో వెనక్కు తగ్గిన కాగ్, జూనియర్ సినిమా విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉందని తెలిసింది.
పన్నుల చెల్లింపుల్లో జరిగిన అవకతవలపై కాగ్ అధ్యయనం చేసిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ శుక్రవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు.