అరుదైన ఫొటో.. ఈరోజుతో సంబంధం ఉన్న వీళ్లెవరో తెలుసా?
on Feb 24, 2021
ఫిబ్రవరి 24 ప్రత్యేకత ఏమిటో తెలుసా? ఈరోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి దివంగత తలైవి జయలలిత జయంతి. అలాగే భారతీయ సినీ ప్రేమికుల్ని తన అందంతో, అభినయంతో అలరించి అశేష అభిమానుల్ని సంపాదించుకున్న శ్రీదేవి వర్ధంతి. ఆ ఇద్దరూ ఇటు తెలుగు, అటు తమిళ భాషా చిత్రసీమల్ని అగ్ర తారలుగా ఏలినవాళ్లే. దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతుండగానే హిందీ చిత్రసీమకు వెళ్లి, ఉత్తరాది తారల్ని అధిగమించి మరీ నంబర్ వన్గా రాణించారు శ్రీదేవి. మూడేళ్ల క్రితం ఆమె దుబాయ్లో అనుకోనివిధంగా మృతిచెంది తన కోట్లాదిమంది అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేశారు.
మరోవైపు బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే గ్లామర్ క్వీన్గా పేరుపొందిన జయలలిత సినీ రంగంలో తారాపథంలో ఉన్న సమయంలోనే తన గురువు ఎం.జి. రామచంద్రన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ అధ్యక్షురాలై, అచిరకాలంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తలైవిగా పేరుతెచ్చుకొని, 2016లో గుండెపోటుతో మృతిచెంది అశేష అభిమానుల హృదయాల్ని కన్నీటిమయం చేశారు.
అలాంటి ఇద్దరు గొప్ప నటీమణులు కలిసి ఓ సినిమాలో నటించారు. అదీ.. తల్లీకొడుకులుగా! అవును. తమిళంలో వచ్చిన ఆ సినిమా పేరు 'ఆది పరాశక్తి'. కె.ఎస్. గోపాలకృష్ణన్ డైరెక్ట్ చేయగా, 1971లో విడుదలైన ఈ పౌరాణిక చిత్రంలో పార్వతిగా జయలలిత నటించగా, మురుగన్ (సుబ్రహ్మణ్యస్వామి)గా బాలనటి అయిన శ్రీదేవి నటించారు. పై ఫొటో ఆ సినిమాలోనిదే. ఆ ఫొటోలో ఉన్న ఆ ఇద్దర్నీ చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపిస్తోంది కదూ! వారికి తెలుగువన్ నివాళులర్పిస్తోంది.