పాండ్యా బ్రదర్స్ తండ్రి మృతి!
on Jan 16, 2021
ఇవాళ ఇండియన్ క్రికెట్లో హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా సోదరులు తమదైన ముద్రవేస్తూ ముందుకు పోతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ బ్రదర్స్ ఆ జట్టు నాలుగు సార్లు చాంపియన్ కావడంలో తమ వంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. కాగా, వారి తండ్రి హిమాన్షు పాండే గుండె పోటుతో నేడు (జనవరి 16) మృతి చెందారు. దాంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొడుకుల కోసం హిమాన్షు తన వ్యాపారాన్ని సైతం త్యాగం చేశారు.
ఈ రోజు హార్దిక్, క్రునాల్ క్రికెట్లో కెరీర్ను ఆస్వాదిస్తున్నారంటే అది తండ్రి పడిన కష్టం ఫలితమే. ఈ విషయం ఆ బ్రదర్స్ పలు సందర్భాల్లో తెలియజేశారు కూడా. సూరత్లో ఓ చిన్నపాటి కార్ ఫైనాన్స్ బిజినెస్ నడుపుతుండే హిమాన్షు, కొడుకుల కెరీర్ కోసం దాన్ని మూసేసి, అక్కడి కంటే మంచి క్రికెట్ ట్రైనింగ్ సౌకర్యాలు ఉన్న వడోదరకు మకాం మార్చారు. అక్కడి కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో క్రునాల్, హార్దిక్లను చేర్చారు. అక్కడే ఆ సోదరులు క్రికెట్లో శిక్షణ పొంది భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. తమకు మంచి కెరీర్ ఇవ్వడానికి ఎన్నో కష్టాలు పడిన తండ్రిని కోల్పోవడంతో పాండ్యా బ్రదర్స్ కన్నీరు మున్నీరవుతున్నారు.
హిమాన్షు పాండే మృతి వార్త తెలిసిన వెంటనే తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సంతాపం తెలియజేశాడు బారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. "హార్దిక్, క్రునాల్ వాళ్ల నాన్న మృతి చెందారనే వార్త వినగానే గుండె బద్దలైంది. ఆయనతో రెండు మూడు సార్లు మాట్లాడాను. జీవితాన్ని ఎంతగానో ఆస్వాదించే వ్యక్తిగా ఆయన కనిపించారు. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. హార్దిక్, క్రునాల్ గుండె నిబ్బరం చేసుకోండి." అంటూ ట్వీట్ చేశాడు.