'క్రాక్' విషయంలో దిల్ రాజుకు పరాభవం!
on Jan 21, 2021
రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా జనవరి 9న విడుదలైన 'క్రాక్' మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్టయింది. అయితే నైజాంలో ఈ సినిమాని బాగా ఆడుతున్న థియేటర్ల నుంచి తీసేసి పండగకు వచ్చిన వేరే సినిమాలకు కేటాయించారనీ, అంతగా ప్రాధాన్యం లేని థియేటర్లే తమకు ఇచ్చారనీ దిల్ రాజు, ఆయన కజిన్ శిరీష్లపై నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇది ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేకెత్తించింది. ఆయన ఆరోపణలకు అనుగుణంగా 'క్రాక్' ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు నిర్మాతల మండలిలో దిల్ రాజు, శిరీష్పై ఫిర్యాదు చేశారు.
దాంతో గురువారం సాయంత్రం మండలి తన కార్యవర్గంతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ వారాంతం నుంచి 'క్రాక్'కు మరిన్ని థియేటర్లు కేటాయించాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సునీల్ నారంగ్, సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అంతేకాదు, శిరీష్కు వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన వరంగల్ శ్రీను క్షమాపణలు చెప్పాలన్న అల్లు అరవింద్ అభిప్రాయాన్ని మండలి తోసిపుచ్చింది. మొత్తానికి 'క్రాక్' విషయంలో దిల్ రాజు, శిరీష్కు పరాజయం ఎదురయ్యిందనీ, వరంగల్ శ్రీను విజయం సాధించాడనీ ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సంక్రాంతి సీజన్లో 'క్రాక్'తో పాటు మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు రిలీజయ్యాయి. అన్నింటిలోనూ 'క్రాక్' సంక్రాంతి విజేతగా నిలిచిందని ట్రేట్ విశ్లేషకులు తేల్చారు.
Also Read