చిరంజీవి సందేశం: ముఖానికి మాస్క్ ధరించడం వీరుని లక్షణం!
on Jul 16, 2020
యంగ్ హీరో కార్తికేయ మీసం మెలితిప్పుతూ ఉన్నాడు. "హలో" అన్న మాట వినగానే అటు తలతిప్పి చూశాడు. చేతిలో మాస్క్ను తిప్పుతూ ప్రత్యక్షమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. తన ఆరాధ్య నటుడిని చూడగానే "బాసూ" అని ఆశ్చర్యపోయాడు కార్తికేయ. "మీసం మెలేయడం వీరత్వమే. కానీ అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు.. ముఖానికి మాస్క్ ధరించడం వీరుని లక్షణం" అంటూ చేతిలోని మాస్క్ను ముఖానికి ధరించారు చిరంజీవి. మరో మాస్క్ను కార్తికేయ వేపు విసిరారు. దాన్ని అందుకొని "యస్ బాస్" అంటూ ముఖానికి ధరించాడు కార్తికేయ. ఆ మాస్క్పై మెలితిప్పిన మీసాల ఆర్ట్ వర్క్ ఉంది. ఆ మీసాలనే వేలితో దువ్వాడు కార్తికేయ. "మాస్క్ని తప్పనిసరిగా ధరించండి. వీలైనన్ని సార్లు సబ్బుతో చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. సాంఘిక దూరాన్ని పాటించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలాగే మీ కుటుంబాన్నీ, ఈ దేశాన్నీ కాపాడుకోండి. ప్లీజ్" అంటూ చేతులు జోడించారు చిరంజీవి.
కొవిడ్-19 చైన్ను బ్రేక్ చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనీ, లేదంటూ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనాన్ ఘెబ్రియేసస్ హెచ్చరించారు. ఆయన మాటల్ని కోట్ చేస్తూ చిరంజీవి రెండు వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. ఒకటి కార్తికేయతో తీసిన వీడియో కాగా, మరొకటి తెలుగు తార ఈషా రెబ్బాతో తీసిన వీడియో. పెదాలకు లిప్స్టిక్ట్ వేసుకొని నవ్వుతున్న ఈషాను చిరంజీవి "హాయ్" అంటూ పలకరించి, ముఖంపై ఆ చిరునవ్వు కలకాలం ఉండాలంటే ముఖానికి మాస్క్ ధరించాలని సూచిస్తారు. తను మాస్క్ ధరించి, ఆమెకో మాస్క్ ఇస్తారు. ఈషా కూడా ఆ మాస్క్ని ధరిస్తుంది.
రోజురోజుకీ తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో కరోనా ఉధృతి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూ ఉండటంతో సామాజిక బాధ్యతగా చిరంజీవి ఈ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందరినీ మాస్క్లు ధరిస్తూ, శుభ్రత పాటించమని అర్థిస్తున్నారు.