మెగాస్టార్ ఆత్మకథ...
on Apr 5, 2020
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిరంజీవి ఒక చరిత్ర. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, శోభన్బాబు.. ఇలా స్వయంకృషితో పైకొచ్చిన కథానాయకుడు ఆయన. సాధారణ నటుడిగా వచ్చి మెగాస్టార్ స్థాయికి ఎదిగిన తీరు అమోఘం. ఆయన వేసిన బాటలో, ఆ కుటుంబం నుండి ఎందరో వచ్చారు. టాలీవుడ్ వరకూ మెగాస్టార్ ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మీద ఇప్పటివరకు కొందరు జర్నలిస్టులు, అభిమానులు పుస్తకాలు రాశారు. ఇప్పుడు స్వయంగా మెగాస్టార్ తన ఆత్మకథ రాయడానికి రెడీ అవుతున్నారు.
"నా ఆత్మకథ రాసుకోవాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు ఖాళీ దొరికింది కదా (లాక్ డౌన్ వల్ల)! అందుకని, గతంలో జరిగిన సంఘటనలని గుర్తు చేసుకుంటున్నా. వాటిని వీడియో రూపంలో రికార్డ్ చేసుకుంటున్నా" అని చిరంజీవి తెలిపారు. సో... రాబోయే కాలంలో మెగాస్టార్ ఆత్మకథ అందరికీ అందుబాటులోకి వస్తుందన్నమాట.
లాక్ డౌన్ సమయంలో రెండు పూటలా వ్యాయామాలు చేస్తూ, మొక్కలకు నీళ్లు పోస్తూ, తోట పని చేస్తూ, పక్షుల కిలకిలలు వింటూ ప్రకృతితో మమేకమయ్యే అవకాశం వచ్చిందని మెగాస్టార్ అన్నారు. ఇంట్లో కుటుంబంతో గడుపుతున్నానని, లాక్ డౌన్ ముగిసిన తర్వాత మరికొంత సమయం ఇలాగే ఉండాలని అనుకుంటున్నట్టు ఆయన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.