బాలయ్య సొంత కుంపటి!
on Nov 7, 2017
చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్. దానిపై ఎన్నో సినిమాలు నిర్మించారాయన. రీసెంట్ గా తన రీ ఎంట్రీ కోసం ‘కొణిదెల ప్రొడక్షన్స్’ పేరుతో కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసి.. ఆ ప్రొడక్షన్ లోనే తన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ తీశారు. ఇప్పుడు ‘సైరా నరసింహారెడ్డి’ రూపొందుతోంది కూడా ఆ ప్రొడక్షన్ లోనే.
అలాగే వెంకీ.. ఆయనకు అండదండగా.. సురేశ్ ప్రొడక్షన్ ఎలాగూ ఉంది. వెంకీ బ్లాక్ బస్టర్ హిట్స్ లో సింహభాగం సురేశ్ ప్రొడక్షన్స్ లో రూపొందినవే. కెరీర్ డౌన్ ఫాలో అవుతోంది.. అనుకున్నప్పుడు సరిగ్గా సురేశ్ సంస్థ నుంచి ఓ సినిమా వచ్చి.. మళ్లీ తనను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేది. నాగార్జున కైతే.. ఒకటి కాదు... మూడు నిర్మాణ సంస్థలున్నాయ్. అందులో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటేతే.. గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్మెంట్స్ ఇంకొకటి. నాగ్ కార్పొరేషన్ మరొకటి.
పవన్ కల్యాణ్ సొంతం సంస్థ పేరు ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అని అందరికీ తెలిసిందే. ఇక మంచు ఫ్యామిలీకైతే... లక్ష్మిప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్.. ఇలా చాలానే ఉన్నాయ్. మహేశ్ బాబుకి కూడా మూడు సొంత నిర్మాణ సంస్థలున్నాయ్.. ‘ఇందిరా ప్రొడక్షన్స్’. ‘జి.మహేశ్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్, కృష్ణ ప్రొడక్షన్స్ మహేశ్ వే.
ఇక నందమూరి సోదరులు.. తారక్, కల్యాణ్ రామ్ లకు ‘ఎన్టీయార్ ఆర్ట్స్’ ఎలాగూ ఉంది. బన్నీకి ‘గీతా ఆర్ట్స్’, ప్రభాస్ కు గీతాకృష్ణ, యువీ క్రియేషన్స్ రెడీగా ఉన్నాయ్.
వీళ్లు కాక చిన్నా చితకా హీరోలకు కూడా సొంత నిర్మాణ సంస్థలున్నాయ్. లేనిదల్లా ఒక్క బాలయ్యకే. అదేంటి? ‘రామకృష్ణ హార్టీ కల్చరల్’ ఉందిగా అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇంకెక్కడి ‘రామకృష్ణ’ అండీ... దాన్నెప్పుడో మూతవేశారు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆ సంస్థ బాధ్యతను హరికృష్ణకు అందించారు. ఆ సంస్థపై బాలయ్య హీరోగా హరికృష్ణ సినిమాలు కూడా తీశారు.పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, గొప్పింటల్లుడు... ఆ సంస్థ నుంచి వచ్చిన సినిమాలే. 90ల్లో వచ్చిన శ్రీకాంత్ ‘శుభలేఖ’... ఆ సంస్థ నుంచి వచ్చిన చివరి సినిమా. ఆ తర్వాత పలు కారణాల వల్ల సంస్థను మూసేయడం జరిగింది. హరికృష్ణ పిల్లలు కూడా ‘ఎన్టీయార్ ఆర్ట్స్’ అని కొత్త నిర్మాణ సంస్థను పెట్టుకున్నారు. సో.. ఇప్పుడు ఏ నిర్మాణ సంస్థా లేని ఏకైక హీరో బాలయ్య మాత్రమే.
అందుకే... ఇప్పుడున్న హీరోల్లో బయటి నిర్మాతలతోనే ఎక్కువ సినిమాలు చేసిన హీరోగా ఘనత సాధించాడు బాలకృష్ణ. అయితే... బాలయ్య ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. తనక్కూడా ఓ సంస్థ ఉంటే బావుంటుందనే నిర్ణయానికి వచ్చాడు. తన కుమారుడు మోక్షజ్ఙ కెరీర్ ను కూడా దృష్టిలో పెట్టుకొని సొంత సంస్థ స్థాపించాడు. సంస్థ ప ేరు ‘బ్రహ్మతేజా ప్రొడక్షన్స్’.. తన కుమార్తెలు బ్రహ్మణి, తేజస్వినిల పేర్లు కలిసొచ్చేలా ఈ పేరు పెట్టాడు బాలయ్య. తొలి ప్రయత్నంగా ఈ సంస్థ నుంచే ఎన్టీయార్ బయోపిక్ తెరకెక్కనుంది. అలాగే మోక్షజ్ఙ తెరంగేట్రానికి కూడా ఈ సంస్థే వేదిక కానుంది. అంతేకాక, బోయపాటితో తాను చేయనున్న సినిమాను కూడా బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ లోనే తీయనున్నారు బాలయ్య. ఇప్పటివరకూ మనం హీరో బాలయ్యనే చూశాం. ఇక నుంచి నిర్మాత నందమూరి బాలకృష్ణను కూడా చూడబోతున్నాం. అదనమాట విషయం.