అమితాబ్ కోసం వచ్చి కత్తిపోట్లకు గురైన అభిమాని
on Jul 12, 2020
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక వస్త్ర వ్యాపారిని కత్తితో పొడిచి, అతని సెల్ఫోన్ను, డబ్బును దోచుకున్న ఇద్దరు రౌడీలను శనివారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యాపారి పేరు అఖ్విల్ షేక్ (35). తన ఆరాధ్య నటుడు అమితాబ్ బచ్చన్ను చూడటం కోసం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ అతను జూన్ నెలాఖరులో ముంబైకి వచ్చాడు. జుహులోని అమితాబ్ బంగళా జల్సా సమీపంలో ఉన్న ఒక ఫుట్పాత్పైనే అప్పట్నుంచీ ఉంటున్నాడు. జూలై 4న సంజయ్ గోపి ఖ్వారా అలియాస్ ఖిడ్కీ (25), సురేశ్ కంజి ఖ్వారా (20) అనే ఇద్దరు రౌడీలు ఫుట్పాత్పై నిద్రపోతున్న షేక్ను గమనించి, అతడిని టార్గెట్గా చేసుకున్నారు.
"ముందు నిందితులు షేక్ను మద్యం తాగాల్సిందిగా అడిగారు. అతను నిరాకరించాడు. ఆ తర్వాత, ఆ ఇద్దరూ అతడిని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, మరోసారి మద్యం తాగమని బలవంతం చేశారు. షేక్ వాదనకు దిగడంతో, వాళ్లిద్దరూ అతడిని కొట్టడం మొదలుపెట్టారు. వారిలో ఒకడు కత్తి తీసి షేక్పై దాడిచేశాడు. దాంతో షేక్ చేయి, ఛాతీ, పొట్టపైన గాయాలయ్యాయి" అని జుహు పోలీస్ట్ స్టేషన్లోని సీనియర్ ఇన్స్పెక్టర్ పండరినాథ్ వవ్హాల్ చెప్పారు. నిందితులిద్దరూ షేక్ సెల్ఫోన్, డబ్బుల్ని కూడా దోచుకొని, అక్కడ్నుంచి పరారయ్యారని ఆయన తెలిపారు. గాయపడిన షేక్ను గమనించిన స్థానికులు కొంతమంది వెంటనే కూపర్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అతనక్కడే చికిత్స చేయించుకుంటున్నాడు.
Also Read