ఐశ్వర్యతో అభిషేక్ ప్లాన్ చేసిన డేట్ నైట్ డిజాస్టర్ అయ్యింది!
on Oct 17, 2020
తొలిసారి 2000 సంవత్సరంలో మెరుపుతీగ ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి 'ధాయి అక్షర్ ప్రేమ్ కే' సినిమాలో నటించారు. తమ స్నేహం ఒకనాటికి అందమైన బంధంగా మారుతుందని అప్పుడు వారు ఊహించలేదు. ఏడేళ్లు గడిచాక, వాళ్ల పెళ్లి అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ఆ ఈవెంట్ను కవర్ చేయని న్యూస్ చానల్ కానీ, మీడియా సంస్థ కానీ లేదు. 2011లో వాళ్లు ఒక చక్కని పాపకు అమ్మానాన్నలుగా మారారు. ఆ పాపకు ఆరాధ్య అనే పేరు పెట్టుకున్నారు.
కాగా భార్యతో ఒకసారి డేట్ నైట్ డిన్నర్ ప్లాన్ చేశాడు అభిషేక్. కానీ అది దారుణంగా బెడిసికొట్టింది. ఆ విషయాన్ని అతడే షేర్ చేసుకున్నాడు. అందరూ మగాళ్లూ తప్పులు చేస్తుంటారు. అభిషేక్ అందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఆ తప్పును ఒప్పుకోవడంలోనే అభిషేక్ గొప్పతనం ఉంది. "2009లో మా పెళ్లిరోజున మాల్దీవుల్లోని బీచ్లో క్యాండిల్లైట్ డిన్నర్ ప్లాన్ చేశాను. కానీ అది డిజాస్టర్గా మారింది. మొదట గాలికి క్యాండిల్ ఆరిపోయింది. రెండోది, మా ఫుడ్లో ఇసుకపడి, తింటుంటే అది పళ్లకింద పడి దారుణమైన టేస్ట్ను ఇచ్చింది. కాబట్టి ఇలాంటివి పెట్టుకోవద్దని నేను మగాళ్లకు సలహా ఇస్తున్నా." అని చెప్పాడు అభిషేక్.
ఐశ్వర్యలో తనకు తెలిసి మోస్ట్ రొమాంటిక్, కూలెస్ట్ విషయం ఏమంటే, ఆమెతో కలిసి ఎన్ని గంటలైనా మాటలు చెప్పుకుంటూ గడపగలగడం అంటాడు అభిషేక్. "మేం అన్ని రకాల విషయాలను చాలా లోతుగా ఎంతసేపైనా మాట్లాడుకుంటూ ఉండిపోగలం. నిజానికి అనేక రాత్రలు మేం కేవలం మాట్లాడుకుంటూ ఉండిపోతాం. మనం చెప్పే మాటలు వినగల, మన కోసం సమయం వెచ్చించే భార్యను పొందడం కంటే రొమాంటిక్ విషయం ఇంకేముంటుంది" అంటాడు అభిషేక్.
Also Read