టాలీవుడ్ స్టార్ వార్..నిర్మాతల ఆందోళన
on Aug 18, 2014
టాలీవుడ్ లో రాబోయే నెలరోజుల్లో స్టార్ వార్ జరగబోతుంది. ఈ ఫైట్ నిర్మాతలకు నష్టం కలిగిస్తుందేమోనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా స్టార్ హీరోల సినిమాలు లేక విలవిలలాడిన ధియేటర్ లలో ఒక్క నెలలోనే పండగకళ నెలకొనబోతుంది. జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, మహేష్బాబు, రామ్చరణ్లు తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు.
అందరికంటే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'రభస' ఈ నెల 29న థియేటర్ లలోకి రాబోతుంది. ఈ సినిమా రిలీజైన వారంలోనే రవితేజ తన 'పవర్'తో వస్తున్నాడు. అయితే చాలా తక్కువ సమయలో రెండు భారీ ప్రాజెక్టులు రిలీజ్ కావడంతో వసూళ్ళ పరమైన సమస్య వస్తుందని పంపీణీదారులు ఆందోళన చెందుతున్నారు. మొదటి సినిమాకి హిట్ టాక్ వచ్చినా, ఆ తరువాత వచ్చే సినిమా దాన్ని వసూళ్ళను తగ్గించే ప్రమాదం వుంది. అలాగే తరువాత వచ్చే సినిమా టాక్ సరిగా లేకపోతె దానికి వచ్చే కలెక్షన్లపైన ప్రభావం వుంటుంది.
ఈ మూవీలు వచ్చిన మరో రెండు వారాలకు ప్రిన్స్ నటించిన ‘ఆగడు’.. దసరా సందర్భంగా అక్టోబర్ 1న ‘గోవిందుడు అందరివాడేలే’తో రామ్చరణ్ రాబోతున్నాడు. వీటి మధ్యలో నాగచైతన్య ఒక లైలా కోసం, వర్మ విష్ణుల అనుక్షణం, సచిన్ ‘నీ జతగా నేనుండాలి’ చిత్రాలు పెద్ద చిత్రాలలో పోటీ పడనున్నాయి. ఇలా ఒకే నెలలో ఏడు సినిమాలు రాబోతుండడం వల్ల అందరికి నష్టం జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలకు కనీసం రెండు వారాల గ్యాప్ తప్పనిసరి అని చెబుతున్నారు.
బాలీవుడ్ లో లాగా మన దర్శక, నిర్మాతలు కూడా టైం షెడ్యూల్ సరిగా పాటించడం లేదని అందువల్ల సరైన టైంలో సినిమాలు విడుదల చేయలేకపోతున్నారని సీనియర్ నిర్మాతలు అంటున్నారు. అందువల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని విమర్శిస్తున్నారు. ఇప్పటికైన దర్శక, నిర్మాతలు మేల్కొని ప్రతి సినిమాకి పక్కా ప్రణాళికను ఆచరిస్తే నిర్మాతలపైన భారం తగ్గి, ఇండస్ట్రీ కూడా బాగుంటుందని సినీ విశ్లేషకుల ఆలోచన.