ఇప్పట్లో పవన్ పిల్లలు 'సైరా' చూడలేరు!
on Oct 3, 2019
'సైరా నరసింహారెడ్డి' సినిమాను ప్రశంసిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించారు. అలాగే, 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తదితరులు 'సైరా' చిత్రంపై, అందులో మెగాస్టార్ చిరంజీవి నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.
మెగా ఫ్యామిలీలో యంగ్ స్టార్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక అమితానందంలో ఉన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా వెండితెరపై చిరంజీవి విజృంభించిన తీరు అమోఘం, అద్భుతం, అద్వితీయం అంటూ ట్వీట్లు గట్రా చేశారు. సినిమా విడుదలకు ముందు అన్నయ్య చిరంజీవి గురించి గొప్పగా చెప్పిన పవన్ కల్యాణ్ ఇంకా సినిమా చూశారో లేదో తెలియదు. ఆయన పిల్లలు అకిరా నందన్, ఆద్య మాత్రం ఇప్పట్లో 'సైరా'ను చూడలేరు.
'సైరా నరసింహారెడ్డి' సినిమా మెగా ఫ్యామిలీకి మూల పురుషుడు చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం, పైగా సుమారు రూ. 250 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో 'బాహుబలి' స్థాయిలో తెరకెక్కించడంతో మెగా వారసులు, వారసురాళ్లు పండగ చేసుకుంటున్నారు. సినిమాపై ఒక రేంజ్ లో ట్వీట్లు, పేస్ బుక్ లో పోస్టులు, ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పిల్లలు సినిమా చూశారా? లేదా? వాళ్ళ స్పందన ఏంటి? అని కొందరు అభిమానులు ఎదురు చూశారు. పైన చెప్పినట్టు... ఇప్పట్లో పవన్ కల్యాణ్ పిల్లలు 'సైరా'ను చూడలేరు. ఇప్పట్లో అంటే వచ్చే వారం, పది రోజుల్లో. ఎందుకంటే... పిల్లలు ఇద్దరితో కలిసి తల్లి రేణు దేశాయ్ విదేశాలకు వెళ్లారు. దసరా సెలవులు రావడంతో వెకేషన్ ప్లాన్ చేశారన్నమాట.