బాలయ్య సాహసం. చూస్తే... నిజంగా షాకే
on Aug 7, 2017
వయసు పెరిగే కొద్దీ కుర్రాడైపోతున్నాడు బాలయ్య. ముప్పై ఏళ్ల క్రితం చేయాల్సిన సాహసాలు ఇప్పుడు చేస్తున్నాడు. 57 ఏళ్ల వయసులో ఇలాంటి సాహసాలు చేస్తుంటే... లొకేషన్లో చూసేవారికి గుండె ఆగినంత పనవుతుంది. రానున్న ‘పైసా వసూల్’లో బాలయ్య చేసిన అడ్వంచర్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.
రీసెంట్ బాలయ్య అడ్వంచర్స్ పై భవ్య క్రియేషన్ వారు ‘గ్లింప్స్ ఆఫ్ ఎన్.బి.కె. స్టంట్స్ ఇన్ పైసా వసూల్’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. నిజంగా ఈ వీడియో చూస్తే.. ఆ వయసులో ఇలాంటి అడ్వంచర్స్ చేస్తున్న బాలయ్యను చూసి అభినందించకుండా ఉండలేం.
మామూలుగా కారు ఛేజింగ్ లాంటి సన్నివేశాలు తీయాలన్నా... కారుతో విన్యాసాలు చేయాలన్నా హీరోకు బదులు డూప్ ని వాడతారు. కానీ... బాలయ్య ‘డూప్ వద్దు’ అనేశారట. తానే స్వయంగా ఆ ఫీట్ చేసేశారు. కారును వేగంగా తీసుకొచ్చి గిర్రున ఒకేచోట తిప్పేయడం షాట్. ఆ షాట్ లో బాలయ్యతో పాటు శ్రీయ కూడా ఉండటం విశేషం. బాలయ్య చేసిన ఆ సాహసాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న శ్రియకు నోట మాట రాలేదట. కారులో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కూర్చుందట. షాట్ ఓకే అవ్వగానే... బతుకు జీవుడా... అంటూ కారు నుంచి ఒక్క ఉదుటన దిగి ఒకటే ఉరుకు.
ఇక చిత్ర యూనిట్ అయితే..బాలయ్యను అభినందనలతో ముంచెత్తింది. ‘అదరగొట్టేశారు సార్..’అంటూ పూరీ ప్రశంసల వర్షం కురిపించేశారు. ఈ చిత్రానికి సహ నిర్మాత అయన ఛార్మి కూడా బాలయ్యను పొగడ్తలతో ముంచేసింది. పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర అయితే... ‘సూపర్ గా చేశారు అంకుల్’ అంటూ కాసేపు బాలయ్య చేయి పట్టుకొని వదలలేదట.
ఆయన సాహసం ఏ స్థాయిలో చేశారో చూడాలంటే... ఆ వీడియో మీరూ చూడంది.