మన్మథుడికి అతిథిగా కోడలు
on Apr 3, 2019
అక్కినేని మామా కోడళ్ళు నాగార్జున, సమంత మరోసారి కలిసి నటించనున్నారు. ఈసారి వీరిద్దరినీ తెరమీదకు తీసుకు వస్తున్నది హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. 'మనం' సినిమాలో మామా కోడళ్ళు తొలిసారి కలిసి నటించారు. అందులో నాగార్జునకు సమంత అమ్మ గా కనిపించారు. ఆ సినిమా తర్వాత 'రాజు గారి గది 2' చేశారు. త్వరలో 'మన్మథుడు 2'లో కనిపించనున్నారు. అదీ అతిథిగా! నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన్మథుడు 2'. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఓ పది నిమిషాల పాటు తెరపై కనిపించే ప్రత్యేక అతిధి పాత్రలో సమంత నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఆమె క్లోజ్ ఫ్రెండ్. అందులోనూ మామ గారు చేస్తున్న సినిమా. ప్రత్యేక పాత్రలో నటించమని సంప్రదించగానే సరే అన్నారట. ఇటీవల హైదరాబాద్లో 'మన్మథుడు 2' ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో 40 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం పోర్చుగల్ వెళ్లనున్నారు. ఆ షెడ్యూల్ లో సమంతపై సన్నివేశాలు తెరకెక్కిస్తారేమో! ప్రస్తుతం ఈ శుక్రవారం విడుదల కానున్న 'మజిలీ' ఫలితం కోసం అక్కినేని కుటుంబం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పెళ్లి తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి సమంత నటించిన తొలి చిత్రం ఇది.