మహేశ్తో మరోసారి పూజ?
on Apr 7, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ `మహర్షి`లో నాయికగా అలరించింది బుట్టబొమ్మ పూజా హెగ్డే. అందులో మహేశ్, పూజ జంట చూపరులకు కనులపంటగా నిలిచింది. కట్ చేస్తే.. ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారని టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `అతడు`, `ఖలేజా` తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేశ్ ఓ సినిమా చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `సర్కారు వారి పాట` పూర్తి కాగానే.. త్రివిక్రమ్ కాంబో సినిమా పట్టాలెక్కించేందుకు మహేశ్ ప్లాన్ చేశారట. ఇందులోనే మహేశ్ కి జంటగా పూజా హెగ్డే నటించే అవకాశముందని ఫిల్మ్ నగర్ బజ్. అదే గనుక నిజమైతే.. అటు మహేశ్ తోనూ, ఇటు పూజతోనూ త్రివిక్రమ్ కి ఇది మూడో సినిమా అవుతుంది. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో పూజ మెయిన్ లీడ్ గా నటించిన సంగతి తెలిసిందే.
కాగా, త్రివిక్రమ్ ప్రస్తుతం యంగ్ టైగర్ యన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఆ ప్రాజెక్ట్ తరువాతే మహేశ్ తో త్రివిక్రమ్ సినిమా ఉండొచ్చు.
Also Read