మోక్షజ్ఞ సినిమా గురించి మీకు తెలీని విషయాలు!
on Sep 7, 2017
ఎట్టకేలకు కొడుకు తెరంగేట్రం విషయాన్ని తేల్చేశాడు బాలయ్య. వచ్చే ఏడాది జూన్ లో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని చెప్పి.. అభిమానుల్లో కొత్త ఆనందాన్ని నింపాడు. అంతా బాగానే ఉంది. అసలు మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో రానున్నాడు? అనేది చాలామందికి తెలీని విషయం. దీనిపై సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే... ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయ్. ఇది తెలుగువన్ మీకందిస్తున్న ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్.
మోక్షజ్ఞ డెబ్యూ సినిమా విషయంలో బాలయ్య చాలా కసరత్తులు చేశారు. తొలుత... సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ సినిమా ద్వారా పరిచయం చేద్దామనుకున్నారు. ‘ఆదిత్య 369’కి ఈ సినిమా సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. మరి ఆ ప్రాజెక్ట్ ఏమైంది? అనే విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టీ.. ‘999’ కథలో మోక్షజ్ఞ పాత్ర ఏంటి? అనే విషయాన్ని ముందు తెలుసుకుందాం.
‘ఆదిత్య 369’ సినిమా ముగింపులో టైమ్ మిషీన్ పేలిపోతుంది. మళ్లీ టైమ్ మిషీన్ ఎవరు తయారు చేస్తారు? అనడిగితే.. బాలనటుడైన తరుణ్.. ‘నేను చేస్తాను’ అనడంతో సినిమా ముగుస్తుంది. అక్కడ్నుంచి ‘ఆదిత్య 999’ కథ మొదలవుతుందన్నమాట. ఆ తరుణ్ పాత్రే పెద్దవాడై మోక్షజ్ఞ అవుతాడన్నమాట. ఇక బాలయ్య పాత్ర ఏంటో చెప్పనేలేదు కదూ. మాతృకలో చేసిన ‘కృష్ణకుమార్’ పాత్రనే ఇందులో కూడా చేస్తారు. అలాగే... మరో కాలానికి సంబంధించిన పాత్ర కూడా ఉంటుంది. అంటే ఇందులో కూడా బాలయ్యది ద్విపాత్రాభినయమే అన్నమాట. దాదాపుగా ‘999’తో మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారైపోయింది. అయితే... మళ్లీ ఏమైందో ఏమో ఆ సబ్జక్ట్ ని ప్రస్తుతానికి పక్కనపెట్టేశారు బాలయ్య. సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుందనీ.. దానికి కాస్త సమయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ.. బాలయ్య తన అంతరంగికులతో అన్నట్టు సమాచారం.
ఇక ఆ తర్వాత తాను వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి రీసెంట్ గా మీడియాకు క్లారిటీ ఇచ్చేశాడు. మరి రేపు జూన్ లో మోక్షజ్ఞ పరిచయమయ్యే చిత్రానికి దర్శకుడెవరు? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
మొదట్నుంచీ ఈ రేస్ లో బోయపాటి శ్రీను ముందున్నా... ఇప్పుడు దర్శకుడు క్రిష్ పేరు వెలుగులోకొచ్చింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సెట్ లో బాలయ్యకు క్రిష్ ఓ కథ వినిపించాడు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న బర్నింగ్ ప్రాబ్లమ్ చుట్టూ ఈ కథ నడుస్తుందని సమాచారం. అంతర్లీనంగా ఇదొక అద్భుతమైన ప్రేమకథ కూడానట. దాంతో ఇదే మోక్షజ్ఞ ఎంట్రీకి సరైన కథ అని బాలయ్య ఫిక్స్ అయినట్టు తెలిసింది.
ప్రస్తుతం క్రిష్... బాలీవుడ్ లో ‘ఝాన్సీలక్ష్మీబాయ్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మోక్షజ్ఞేమో... నటనపై తర్ఫీదు తీసుకునే పనిలో ఉన్నాడు. వీరిద్దరూ ఫ్రీ అవ్వగానే.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుందని సమాచారం. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం.
మరో విషయం ఏంటంటే... మోక్షజ్ఞ ఎంట్రీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని బాలయ్య భావించడం లేదు. చాలా సాధారణంగా ఎలాంటి ఆర్భాటాలూ లేకుండా ప్రారంభ వేడుక ఉంటుందట. కథ నేల మీద నడవాలనీ... అభూత కల్పన అనిపించే టేకింగ్ అస్సలు ఉండకూడదనీ, తొలి పరిచయంతోనే పరిచయమున్న కుర్రాడిగా మోక్షజ్ఞ అందరికీ చేరువ అవ్వాలని బాలయ్య భావిస్తున్నారు. ఇలాంటి కథల్ని డీల్ చేయడంలో క్రిష్ సమర్థుడు కాబట్టే.. అతనికి ఈ బాధ్యత అప్పజెప్పినట్టు తెలిసింది.