కన్నీరు పెట్టుకున్న ఎన్టీఆర్
on Oct 2, 2018
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఈ చిత్రం ప్రీ రీలీజ్ ఈవెంట్ ఈరోజు నోవొటెల్ లో అభిమానుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. సినిమా ట్రైలర్ ను కూడా ఈ సందర్భంగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూసి అభిమానుల ఎంతలా కేరింతలు పెట్టారో.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లని చూసి కన్నీరు కూడా అలానే పెట్టుకున్నారు. నెలరోజుల క్రితం నందమూరి కుటుంబంలో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాదంలోనే ఎన్టీఆర్ నిర్మాతలకు నష్టం కలగకూడదని షూటింగ్ లో పాల్గొని సినిమాని సమయానికి పూర్తి అయేలా చేసారు. ఎన్టీఆర్ తెర మీద అయితే అద్భుతంగా నటించగలరు కానీ.. తెర బయట నటించలేరు కదా. అందుకే ఆయన మనసులో బాధ కళ్ళలో కనిపించింది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రామ లక్ష్మణుల్లా ఈ వేడుకకు కలిసొచ్చారు. వాళ్ళిద్దరిని చూసి అభిమానులు ఆనందపడ్డారు కానీ వాళ్ళిద్దరి కళ్ళలో ఆనందం లేదు. వారి తండ్రి హరికృష్ణ దూరమయ్యారనే బాధ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ స్పీచ్ సమయంలో ఎన్టీఆర్ కన్నీరు పెట్టుకున్నారు. నాన్న చనిపోయిన ఐదోరోజు నుండే, నిర్మాతలకు నష్టం కలగకూడదని ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్నారని చెప్పిన కళ్యాణ్ రామ్.. 'ఏడ పోయినాడో' సాంగ్ రెండు లైన్లు పాడి వినిపించారు. ఆ సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కళ్ళలోకి చూస్తే ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు తిరుగుతాయి.