గెలిచి చూపించడం నాకు అలవాటు: మహేశ్
on Apr 8, 2019
మహేశ్ గెలిచాడు... 'మహర్షి'లా ప్రేక్షకుల మనసులు గెలిచాడు! ఒక కార్పొరేట్ కంపెనీ సీఈవోగా, కాలేజీ విద్యార్థిలా... స్టైలుగా, మాసీగా... అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా డిఫరెంట్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. లుక్స్ పరంగా, లుక్స్ కి తగ్గట్టు యాక్టింగ్ పరంగా వేరియేషన్ చూపించాడు. తన విజయపథంలో 'మహర్షి' మరో అడుగు అవుతుందని టీజర్ ద్వారా చూపించాడు. మహేష్ బాబును ప్రేక్షకులు కోరుకునేలా చూపించడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యాడు. టీజర్ వరకూ మహేష్ గెలిచాడు. కానీ, దర్శకుడు గెలవలేదు. సినిమా విడుదలైన తరవాత కథ, కథను తెరకెక్కించిన విధానం బట్టి వంశీ పైడిపల్లి ఎంతవరకూ గెలిచాడనేది చెప్పగలం. ప్రస్తుతానికి అతడు మహేష్ ఇమేజ్ మీద ఆధారపడ్డాడు.
సినిమా కథ గురించి టీజర్ లో చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. 'అల్లరి' నరేశ్, పూజా హెగ్డే పాత్రలను అసలు చూపించలేదు. హీరో పాత్రను పరిచయం చేయడానికి మాత్రమే వాడుకున్నారు. ముఖ్యంగా హీరో ఫిలాసఫీ, యాటిట్యూడ్ చెప్పడానికి టీజర్ కట్ చేశారు. 'సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు. కామాలు మాత్రమే ఉన్నాయి. సక్సెస్ అనేది ఓ గమ్యం కాదు. ప్రయాణం' డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'నాకో ప్రాబ్లమ్ ఉంది సార్... ఎవరైనా నువ్వు ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు' డైలాగ్ లో హీరో యాటిట్యూడ్ కనిపిస్తోంది. ఉగాది కానుకగా విడుదలైన ఈ టీజర్ పై ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికి సినిమాలో ఓ పాట విడుదలైంది. త్వరలో మిగతా పాటల్ని, మే 9న సినిమాను విడుదల చేయనున్నారు.