వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ
on Jul 28, 2018
విశ్వనాథ్.. ఆ పేరు సంగీతంలా వినిపిస్తుంది.. ఆయన తీసిన సినిమాలు సంప్రదాయంలా హృదయాన్ని హత్తుకుంటాయి.. సాధారణంగా సినిమాలు కళ్ళతో చూస్తాం కానీ విశ్వనాథుని సినిమాలు హృదయంతో చూస్తాం.. తెలుగు కళామ్మతల్లి మెడలో శంకరాభరణం వేసిన విశ్వనాథుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఆయన పేరు, ఆయన తీసిన సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి.. అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని వెండితెర మీద చుపించాలనుకుంటున్నారు రచయిత, దర్శకులు జనార్ధన మహర్షి.. విశ్వనాథ్ తీసిన సినిమాలు వెండితెర మీద కనిపిస్తేనే వెండితెర పులకరించిపోతుంది.. అలాంటిది విశ్వనాథ్ జీవితమే వెండితెర మీద కనిపిస్తే వెండితెర జన్మ ధన్యమైపోతుంది.. దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె. విశ్వనాథ్ జీవితం వెండితెరపైకి తీసుకురావాలన్న ఆలోచన అద్భుతం.. విశ్వదర్శనం’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా హైదరాబాద్లో జరిగాయి. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అనేది ట్యాగ్లైన్. రచయిత, దర్శకులు జనార్ధన మహర్షి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వెంకటేష్, నాగ చైతన్య కలయికలో వస్తున్న సినిమాకి కూడా జనార్ధన మహర్షి కథ అందించడం విశేషం.. శుక్రవారం జరిగిన విశ్వదర్శనం పూజా కార్యక్రమంలో కె. విశ్వనాథ్ దంపతులు పాల్గొన్నారు. సినిమా స్క్రిప్ట్ని దర్శకుడు జనార్ధన మహర్షికి కె. విశ్వనాథ్ దంపతులు, తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్రసహనిర్మాత వివేక్ కూచిభొట్ల అందజేశారు. ఈ చిత్రానికి స్వరవీణాపాణి స్వరకర్త. ఈ వేడుకలో విశ్వనాథ్గారి దంపతులను సత్కరించారు చిత్రబృందం. ఆరేళ్ల క్రితం జనార్ధన మహర్షి దర్శకత్వంలో రూపొందిన ‘దేవస్థానం’ చిత్రంలో విశ్వనాథ్ ముఖ్య భూమికలో కనిపించారు. కాగా, ఈ కళాతపస్వి జీవిత చరిత్ర పలువురికి ఆదర్శవంతంగా నిలుస్తుందని, ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో జనార్ధన మహర్షి ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు. విశ్వనాథ్ పుట్టుక నుంచి ఇప్పటివరకూ వివిధ దశలలో ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చిత్రబృందం ప్రకటించనుంది.