థియేటర్ల గొడవ... 'దిల్'రాజుదే పైచేయి!
on Jan 7, 2019
'పేట' నిర్మాత అశోక్ వల్లభనేని, అతడికి మద్దతుగా నిలిచిన తుమ్మల ప్రసన్నకుమార్కు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల క్రితం విడుదల తేదీలు ఖరారైన తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా... నెల రోజుల క్రితం కొన్న డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలకు కాకుండా... ఇతర సినిమాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. 'పేట' నిర్మాతలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారని, తానూ అటువంటి మాటలు మాట్లాడగలనని, అయితే తనకంటూ ఓ క్యారెక్టర్ వుంది కనుక మంచిగా మాట్లాడుతున్నానని 'దిల్' రాజు వ్యాఖ్యానించారు. భారీ అంచనాలు, నిర్మాణ వ్యయంతో వస్తున్న రామ్ చరణ్ 'వినయ విధేయ రామ', ప్రతిష్టాత్మక 'యన్.టి.ఆర్', 'ఎఫ్2' సినిమాలకు థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేయాలా? అని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తలలు పట్టుకుంటుంటే... మధ్యలో డబ్బింగ్ సినిమాను తీసుకొచ్చి థియేటర్లు అడ్జస్ట్ చేయమంటే ఎలా? అని ఆయన నిలదీశారు. ఈ గొడవలో 'దిల్' రాజుదే గట్టి పాయింట్. తెలుగు సినిమాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, తమిళ సినిమాలకు ఎలా థియేటర్లు ఇస్తారనేది అందరూ ఆలోచించాల్సిన విషయమే.
ప్రస్తుతం అశోక్ వల్లభనేని థియేటర్ల మాఫియా అని లేవనెత్తిన ఈ గొడవలో ఇటు పరిశ్రమ నుంచి... అటు ప్రేక్షకుల నుంచి 'దిల్'రాజుకు ఎక్కువ శాతం మంది మద్దతు లభిస్తోంది. అశోక్ వల్లభనేనికి మద్దతుగా ఎవరూ మాట్లాడటం లేదు. ఆయన నోరు పారేసుకోవడం సరికాదని సోషల్ మీడియాలో జనాలు చీవాట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్, 'పేట' తప్ప జనవరి 18 నుంచి మిగతా సినిమాలు థియేటర్లలో వుండవని ప్రసన్నకుమార్ మాట్లాడిన మాటలపై కూడా 'దిల్' రాజు స్పందించారు. "అదేదో 18న వాళ్ళ సినిమా విడుదల చేస్తే సరిపోతుందిగా.. థియేటర్లు అన్నీ వాళ్ళకే వెళతాయి" అని ఆయన అన్నారు.