సెన్సార్ చిక్కుల్లో 'భైరవగీత'
on Nov 28, 2018
రామ్గోపాల్ వర్మ మహా మేధావి. వివాదాస్పద విషయాలను చెప్పీ చెప్పనట్టు ట్వీట్లు చేయడంలో వర్మకు ఎవరూ సాటి రారు. మంగళవారం రాత్రి ఆయనో ట్వీట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే.. సెన్సార్ చిక్కులు, సమస్యల వల్ల 'భైరవగీత' సినిమా ఈ నెల 30న విడుదల కావడం లేదు. డిసెంబర్ 7కు వాయిదా వేశారు. ఇదే విషయాన్ని సూటిగా చెబితే వర్మలో ప్రత్యేకత ఏముంటుంది? సెన్సార్ నుంచి చిక్కులు వచ్చాయని చెప్పకుండా... 'సెన్సార్ రిలేటెడ్ టెక్నికల్ ఇష్యూస్' అని ట్వీటారు. 'భైరవగీత'లో హింస, రక్తపాతం, అందాల ప్రదర్శన ఎక్కువ కావడంతో... వాటన్నిటికీ కత్తెర వేయమని, కొన్ని డైలాగులను మ్యూట్ చేయమని సెన్సార్ బోర్డ్ చెప్పిందట! దీన్ని వర్మ 'టెక్నికల్ ఇష్యూస్'గా పేర్కొన్నారు. మొత్తానికి కన్నడ నటుడు ధనుంజయ హీరోగా, ఇర్రా మోర్ హీరోయిన్గా సిద్ధార్థ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబర్ 7కు వాయిదా వేశారు వర్మ. వాయిదాకు ముందు రజనీకాంత్, శంకర్ '2.ఓ'తో మా సినిమా పోటీ అంటూ చేసిన హడావుడిని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు.