నితిన్ తో సాయిపల్లవి?
on Apr 7, 2021
ఈ నెలలో రెండు వారాల గ్యాప్ లో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో సందడి చేయనుంది `ఫిదా` పోరి సాయిపల్లవి. ఈ నెల 16న యువ సామ్రాట్ నాగచైతన్యతో జోడీ కట్టిన `లవ్ స్టోరి` రిలీజ్ కానుండగా.. 30న రానా దగ్గుబాటికి జంటగా నటించిన `విరాట పర్వం` విడుదల కానుంది. ఈ రెండు సినిమాల్లోనూ సాయిపల్లవి అభినయానికి అవకాశమున్న పాత్రల్లో సందడి చేయనుంది. అలాగే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `శ్యామ్ సింగ రాయ్`లోనూ సాయిపల్లవి నాయికగా నటిస్తోంది. నేచురల్ స్టార్ నాని టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కూడా హీరోయిన్స్ గా దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట పల్లవి. ఆ వివరాల్లోకి వెళితే.. `నా పేరు సూర్య` ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం రూపొందనుందని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నితిన్ కి పెయిర్ గా సాయిపల్లవి కనిపిస్తుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. నితిన్, సాయిపల్లవి ఫస్ట్ కాంబో ఏ తీరున అలరిస్తుందో చూడాలి.