బన్నీని టార్గెట్ చేసుకున్న మెగా కాంపౌండ్ బ్రదర్స్!
on Mar 26, 2020
సంక్రాంతికి వచ్చిన 'అల.. వైకుంఠపురములో'తో కెరీర్ బెస్ట్ హిట్ని అందుకున్నాడు అల్లు అర్జున్. 'దేశముదురు' (2007) విడుదలైన జనవరి 12నే పదమూడేళ్ల తర్వాత వచ్చిన 'అల..' అల్లు స్టార్ క్రేజ్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. అలా.. బన్నీకి తన లక్కీ డేట్ మరోసారి అచ్చొచ్చినట్లయ్యింది.
కట్ చేస్తే.. మెగా కాంపౌండ్ నుంచి మరో ఇద్దరు కథానాయకులు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ లక్కీ డేట్స్ని టార్గెట్ చేసుకున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు.. 'పంజా' బ్రదర్స్ సాయితేజ్, వైష్ణవ్ తేజ్. ఈ వేసవిలో 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ సాయితేజ్.. 'ఉప్పెన'తో వైష్ణవ్ తేజ్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఇద్దరు కూడా బన్నీకి అచ్చొచ్చిన తేదీల్లోనే ఆయా చిత్రాలతో పలకరించనుండడం విశేషం.
సాయితేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' విషయానికి వస్తే.. మే 1న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ రిలీజ్ కానుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 2008లో సరిగ్గా ఇదే మే 1కి వచ్చిన బన్నీ చిత్రం 'పరుగు' మంచి విజయం సాధించింది. సో.. బన్నీకి కలిసొచ్చిన తేదికి సాయితేజ్ కొత్త చిత్రం రాబోతోందన్నమాట. ఇక కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏప్రిల్ 2కి రావాల్సిన వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన'.. మే 7కి వాయిదా పడిందని టాక్. అదే గనుక నిజమైతే.. బన్నీ కెరీర్ ని మలుపు 'ఆర్య' (2004) తేదీకి 'ఉప్పెన' వస్తున్నట్టే. 'ఆర్య'తో సుకుమార్ దర్శకుడిగా పరిచయమైతే.. 'ఉప్పెన'తో అతని శిష్యుడు బుచ్చి బాబు సానా డైరెక్టర్గా తొలి అడుగేస్తున్నాడు. త్వరలోనే 'ఉప్పెన' కొత్త రిలీజ్ డేట్పై క్లారిటీ వస్తుంది.
మరి.. బన్నీ లక్కీ డేట్స్ని టార్గెట్ చేసుకున్న సాయితేజ్, వైష్ణవ్ తేజ్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.