ఆ దర్శకుడు .. నరకం చూపిస్తాడట
on Jan 30, 2017
నిర్మాత బండ్ల గణేష్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో చాలా కొత్త కబుర్లు చెప్పాడు బండ్ల. మరో యాబై ఏళ్ళు సినిమాలు తీస్తానని., కనీసం పదిమంది దర్శకులనైనా ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని, పవన్ కళ్యాణ్ తో కలసి సినిమాలు నిర్మిస్తానని, ఒక స్టూడియో కూడా కడతాని.. ఇలా బోలెడు ముచ్చట్లు చెప్పాడు గణేష్. ఇదే సందర్భంలో ఓ దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘’ఒక దర్శకుడితో సినిమా తీసా. నరకం చూస. ఇలాంటి వాడితో సినిమా తీస్తున్నానా అని రోజు బాధ పడే వాడిని. సాయంత్రం అయితే మందు.. డ్రగ్స్.. ఒక్కటేమిటి నరకం చూపించాడు. పేరుకి గొప్ప డైరెక్టర్. ఈ సినిమా మరో యాబై ఏళ్ళు నిలిచిపోతుందని చెబుతుంటాడు. దారుణం. చెప్పిన కధ తీయడం చేతకాదు. ఏదేదో చేస్తుంటాడు. సినిమా అంటే గౌరవం లేదు. సినిమా కంటే గొప్ప వాడినని ఫీలౌతుంటాడు. లక్కీగా ఓ మూడు హిట్లు కొట్టిండవచ్చు. ఆ సినిమాలు పేర్లు చెప్పుకునే ఇంకా బండిలాగించేస్తున్నాడు. నాలుగు హాలీవుడ్ సినిమాలు చూసి ఫ్రేములు పెట్టుకోవడమే తెలుసువాడికి. నిజంగా ఇలాంటి వాడితో ఇండస్ట్రీకి ఉపయోగం వుండదు. వాడితో సినిమా చేస్తున్నంత కాలం నరకం చూశా’’ అని ఓ సంచలన వ్యాఖ్యలు చేశాడు గణేష్.
అయితే ఆ దర్శకుడి పేరు చెప్పనప్పటికీ ఇన్ డైరెక్ట్ గా హింట్ కూడా ఇచ్చేశాడు బండ్ల. ఇప్పటివరకూ బండ్ల గణేష్ ఏడు సినిమాలు తీశాడు. ఆంజనేయులు (పరశురాం ) తీన్ మార్ (జయంతి ), గబ్బర్ సింగ్ (హరీష్ శంకర్ ) బాద్షా ( శ్రీను వైట్ల ) ఇద్దరమ్మాయిలతో (పూరి జగన్నాధ్) గోవిందుడు అందరివాడెలే ( కృష్ణ వంశీ) టెంపర్ (పూరి జగన్నాధ్). ఇందులో పూరి జగన్నాధ్, హరీష్ శంకర్ , శ్రీను వైట్ల అంటే తనకు ఇష్టమని చెప్పాడు బండ్ల. ఇక మిగిలిన వారిలో ఇండస్ట్రీ లో ‘గొప్ప’ సినిమాలు, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు తీసే దర్శకుడిగా పేరుపడ్డ ఆ వ్యక్తి ఎవరో మనమే అర్ధం చేసుకోవాలన్నమాట.