LATEST NEWS
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన  ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.  దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ విశాఖలో ఏర్పాటు కావడం వెనుక ఉన్నది చంద్రబాబు కృషీ చిత్తశుద్ధేనని అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.  అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఈ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఆ కంపెనీలు   రూ.1,47,162 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. రెండు దశల్లో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యం. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా  65 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డ్ చేరింది. భారత రాజకీయ చరిత్రలోనే గతంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. అయన పీఎంగా  అత్యున్నత స్థానంలో  అత్యధిక రోజులు కొనసాగిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అదెలా ఉంటే  నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు.  దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి  8932  రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు  రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా  మోడీ కొత్త రికార్డు సృష్టించారు.    వివరాల్లోకి వెడితే.. 2001 అక్టోబ‌ర్ 7న గుజ‌రాత్ సీఎంగా తొలిసారి గా బాధ్య‌త‌లు చేపట్టిన ఆయన సుమారు 13 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.  అనంతరం.. 2014, మే 26న భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం  చేశారు. నాటి  నుంచి నేటి వ‌ర‌కూ ఆయ‌న భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. అంటే గుజరాత్ సీఎంగా నాలుగు సార్లు, ప్రధనిగా మూడు సార్లు వరుస ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా మోడీ  సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్ర‌భుత్వాధినేత‌గా   కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మోడీ 2002, 2007, 2012 ఎన్నిక‌ల‌ను ముఖ్య‌మంత్రిగా విజ‌యం సాధించ‌డం మాత్ర‌మే కాదు.. 2014, 19, 24 ఎన్నిక‌ల‌ను ప్ర‌ధానిగా విజ‌యం సాధించ‌డం  కూడా ఒక రికార్డే. ప్ర‌ధానిగా వ‌రుస‌గా  మూడు ఎన్నిక‌ల విజ‌యం సాధించ‌డం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్లాల్  నెహ్రూ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టారు. అత్య‌ధిక కాలం  పీఎంగా ఉండి  మజీ ప్రధాని ఇందిరా  గాంధీ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు.  అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ఉన్న రెండో పీఎం మోడీయే. అంతే కాదు ముఖ్య‌మంత్రిగా ఎక్కువ కాలం అనుభ‌వం ఉన్న ప్ర‌ధాని కూడా మోడీయే. కాగా మోడీ రికార్డులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోడీ ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు, పాలనాదక్షతకు ఇది నిదర్శనమని ప్రస్తుతించారు.  24 ఏళ్లకు పైగా ఎక్కడా విరామం లేకుండా దేశానికి సేవ చేయడం ఒక అరుదైన ఘ‌న‌త‌గా కీర్తించారు.  2029 లో కూడా మోడీయే ప్ర‌ధాని అయితే ఇది మ‌రో ఘ‌న‌త కూడా అవుతుంది.  నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి నాలుగు సార్లు ప్ర‌ధాని అయిన ఈ రికార్డును వ‌చ్చే రోజుల్లో మ‌రే నేత కూడా బ్రేక్ చేసే ఛాన్సే లేద‌ని అంచ‌నా వేస్తున్నారు.
ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం. అంతర్జాతీయ రాజకీయాలలో ఆమెది అందె వేసిన చెయ్యి. యుద్ధ సమయాలలో ఆమె వేసిన అడుగులు విప్లవాత్మకం. ఇక పేదల పాలిట ఆమె పెన్నిది. జనం ఆప్యాయంగా ఆమెను ఇందిరమ్మా అని పిలుచుకున్నారు. గరీబీహఠావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలనకు నడుంబిగించారు.  ఇందిరాగాంధీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. యావత్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు.   దేశ చరిత్రలో   ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ.  గరీబీహఠావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలనకు నడుంబిగించారు. బ్యాంకింగ్ రంగాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా వాటిని జాతీయం చేశారు.  బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి విజయం సాధించారు. ఆ సందర్భంగా ఆమెను ప్రత్యర్థులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. వాజ్ పేయి అయితే ఇందిరాగాంధీని కాళికాదేవితో పోల్చి పొగడ్తల్లో ముంచెత్తారు.  అలాగే రాజభరణాలను రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి భారత్ అణుశక్తి దేశంగా అవతరించడానికి దోహదపడ్డారు. అలాగే ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని సమూలంగా అణచివేయడానికి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించారు.   అయితే ఎంతటి మనిషికైనా జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. దేశంలో ఎమెర్జెన్సీ తరువాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ తరువాత ఆమె రాజకీయంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో పడ్డారు. ప్రత్యర్థుల ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఆమె బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కనీసం కోర్టు ఖర్చులకు కూడా చేతిలో డబ్బులోని పరిస్థితిని ఇందిరాగాంధీ ఎదుర్కొన్నారు.  దేశంలోనే తిరుగులేని నాయకురాలిగా ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా అని మన్ననలు అందుకున్న ఇందిరాగాంధీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో పడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థిని ఎదుర్కొన్నారు.  ఆ సమయంలో  ఏదో పని మీద ఇందిరాగాంధీ గారిని  కలవడానికి వచ్చిన పి.వి.నరసింహారావురావును.. “మిస్టర్ పీవీ నాకు కొంచెం డబ్బు అవసరం, సర్దగలరా? అని అడిగారు. దానికి పీవీ ఎంత మేడం అని అడిగితే.. ఇందిరాగాంధీ ఒక వేలు చూపించారట.. దానికి  పీవీ లక్షా అంత నా వద్ద లేదు ఓ ముప్ఫై వేలు ఉన్నాయి అన్నారట. అందుకు ఇందిరాగాంధీ పేలవంగా ఓ నవ్వు నవ్వి వేలూ లక్షలూ కాదు పీవీ కోటి రూపాయలు కావాలి అనడంతో.. పీవీ ప్రయత్నిస్తాను అని చెప్పి బయటకు వచ్చారట. ఆ తరువాత అప్పటి హిందూపురం ఎంపీ సోమశేఖర్ కు విషయం చెప్పి సర్దగలవా అని అడిగితే.. ఆయన తన వల్ల కాదు అని  ఎల్జీ బాలకృష్ణ పేరు సూచించారట. ఎల్జీ బాలకృష్ణ కోయంబత్తూరు కేందరంగా వ్యాపారాలు సాగించేవారు. ఆయనకు హిందూపురంలోనూ రెండు స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి.   సోమ శేఖర్   బాలకృష్ణను కలిసి విషయం చెప్పగానే..  క్షణం ఆలోచించకుండా అంత గొప్ప నాయకురాలు అడిగితే కాదనడం ఏమిటి అంటూ వెంటనే రెండు ట్రంకు పెట్టేల్లో కోటి రూపాయలు నింపి ఇచ్చి పంపించారట. అప్పట్లో వందరూపాయల నోటే పెద్దది. అటువంటి వందరూపాయల నోట్లను కట్టలు కట్టి రెండు ట్రంక్ పెట్టెల్లో నింపి ఇద్దరు మనుషులను తోడిచ్చి మరీ ట్రైన్ ఎక్కించారట. ఆ సొమ్ము అలా పీవీ నరసింహరావు ద్వారా ఇందిరాగాంధీకి చేరింది. ఎవరిచ్చారు అని అడిగితే పీవీ ఎల్జీబాలకృష్ణ పేరు చెప్పారు. ఇందిరాగాంధీ ఆ పేరు నోట్ చేసుకున్నారట. సాధారణంగా అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ అంతటి గొప్ప వ్యక్తి అడిగితే ఇవ్వడం, ఆ తరువాత ఆ విషయం మరుగున పడిపోవడం జరుగుతుందిప. కానీ ఇందిరాగాంధీ వ్యక్తిత్వం అలాంటిది కాదు.     1980 ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి తనను కష్టకాలంలో ఆదుకున్న బాలకృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన కారులో  ప్రమాణ స్వీకార వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో   ఎల్జీ బాలకృష్ణకుప్రత్యేక ఆసనం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశారు.  ఇవేవి  మొక్కుబడికి చేసిన మర్యాదలు కావు.  దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి,  మనస్ఫూర్తిగా  చేసిన మర్యాదలు. మూడేళ్ల కిందట ఎల్జీ బాలకృష్ణ తనకు కష్ట కాలంలో చేసిన సాయాన్ని మరిచిపోకుండా ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు ఇందిరాగాంధీ. ప్రధాని హోదాలో ఉన్న ఇందిరా గాంధీ  ఆయనకు హాయ్  చెప్పి, షేక్ హ్యాండిచ్చి ఊరుకోవచ్చు.  కాదనేవారు ఎవరు? లేదా, వేరొకరికి  అప్పచెప్పి, ప్రమాణ స్వీకారంలో  ముందు వరుసలో సీటు కేటాయించి, ఓ ఫోటో దిగి వెళ్లిపోవచ్చు. అదే గొప్ప.  కాని.. ఇందిరాగాంధీ అలా చేయలేదు.   గతం గుర్తుంచుకొని  స్వయంగా ఆహ్వానించి, తమతోనే తీసు కెళ్ళి ఇంట్లో కలిసి భోం చేయడం, ఆమె ఔన్నత్యానికి ప్రతీక. చేసిన మేలును మరువని హృదయపూర్వక కృతజ్ఞత. అది ఒక గొప్ప జ్ఞాపిక.  ఉదయం సాయం చేసిన వారిని సాయంకాలానికే  మర్చిపోతున్న ఈ రోజుల్లో పొందిన ఉపకారాన్ని గుర్తుంచుకొని సరైన గుర్తింపు ఇచ్చే వారే నిజమైన నాయకులని నిరూపించిన వాస్తవ ఘటన. ఇందిర వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్నీ నేటి తరం  నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలుగువన్ ఆకాంక్షిస్తోంది.
  పార్టీ స్థాపించి దశాబ్ధం గడిచినా జనసేనకు బలమైన పునాదులు కనిపించడం లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ చరిష్మాతోనే పార్టీ నడుస్తోంది తప్ప.. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కాలేదు. ఓ సారి అధికారంలోకి వచ్చి ఆర్థికంగా కుదుటపడితే, తర్వాత పార్టీ రూట్స్ స్ట్రాంగ్ చేసేలా చర్యలు చేపడతారని జనసేనలోని చాలా మంది భావించారు. అయితే..డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్‌కళ్యాణ్ పూర్తిగా పాలనపైన దృష్టి పెట్టారని.. పార్టీ నిర్మాణాన్ని పక్కన పడేశారని జనసైనికుల్లో ఒకింత అసహనం కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల విమర్శ కూడా అదే. కానీ పార్టీ పటిష్టత దిశగా పవన్ అడుగులు చూస్తే వ్యూహాత్మకంగానే కనిపిస్తున్నాయి.  జనసేనాని పవన్ కళ్యాణ్ తన సోదరుడు, పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నాగబాబు తరచూ ఉత్తరాంధ్రలో అందులోనూ శ్రీకాకుళంలో పర్యటిస్తూ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారంట. తరచూ సిక్కోలు టూర్స్ పై ఓ ఆసక్తికర ప్రచారం కూడా నడుస్తోంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల ప్రభావం చాలా ఎక్కువ. ఇక ఉమ్మడి శ్రీకాకుళంలో ఈ సామాజికవర్గం ఓటర్లే నిర్ణయాత్మకంగా ఉంటారు. అందుకే శ్రీకాకుళం నుంచే పవన్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.  అక్కడ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం పార్టీ రూట్స్ స్ట్రాంగ్ చేసుకోవాలని జనసేనాని స్కెచ్ గీస్తున్నారంట. వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే పార్టీ ఆవిర్బావ వేడుకలు కూడా నాగబాబు ఎచ్చర్లలోనే జరుపుకున్నారు. కాపు ప్రతినిధిగా నాగబాబుని పెట్టి ముందుకెళ్లాలన్నది జనసేనాని స్ట్రాటజీగా తెలుస్తోంది.  ప్రస్తుతానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన తూర్పుకాపు నేత కరువైయ్యారు. దానికి తోడు తూర్పు కాపులకు రాజకీయంగా జిల్లాలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయం కూడా ఉంది. గతసారి వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జిల్లా నుంచి తూర్పుకాపులకు చెప్పుకోదగ్గ పదవులు లేవు. సిక్కోలు పొలిటికల్ వార్ మొత్తం వెలమ వర్సెస్ కళింగ గానే నడుస్తోంది. దీంతో కాపులకు తాను కాపుకాస్తానని చెప్పడమే పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర మొత్తం మీద వైసీపీలో బొత్స సత్యనారాయణ, టీడీపీలో కిమిడి కళావెంకట్రావు బలమైన తూర్పు కాపు నాయకులుగా ఉన్నారు. కిమిడికి దాదాపు మొన్నటి ఎన్నికలే చివరివి అంటున్నారు. ఇక బొత్సకి ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనేది అనుమానమే. సో.. ఇప్పుడు టీడీపీ, వైసీపీలో కాపులను నడిపించే నాయకులు లేరు కాబట్టి.. జనసేన వారికి అండగా  ఉండేందుకు ప్రయత్నిస్తోందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలో జనసేనాని అన్న కోసం ఎచ్చర్లను ఎంచుకోవడంలో కూడా ఓ తెలివైన వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో తూర్పుకాపులే ఎక్కువ. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఈశ్వర్ రావుది కమ్మ సామాజిక వర్గం. కేవలం టీడీపీ బలంతోనే ఆయన గెలిచారు. టీడీపీకి ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్ కూడా లేకపోవడంతో క్యాడర్ తలోదారి అన్నట్టు ఉంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేపై ప్రజల్లో సానుకూలత కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితిని వైసీపీ అయినా క్యాష్ చేసుకుంటుందా? అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కాపు నేత గొర్లె కిరణ్ అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేరా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.  సో.. ఈ పొలిటికల్ స్పేస్ ని నింపడానికి జనసేన ప్రయత్నిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఆచరణ ఉన్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందనేని చివరి వరకు సస్పెన్సే. మరి పవన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. దశాబ్దాలుగా తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకునేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఆయన రంజాన్ ప్రార్థనల్లో  బీఆర్ఎస్ నేతలతో కలిసి పాల్గొనడంతో అప్రమత్తమైన కాంగ్రెస్ ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. అయితే ఆ బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం.  వాస్తవానికి  గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి..  బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపారని, సముచిత గౌరవంతో పాటు భవిష్యత్తులో కీలక పదవిని కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆయన బీఆర్ఎస్ లో చేరతానంటే భుజాల మీద మోసుకుని మరీ తీసుకువెడతానని బీఆర్ఎస్ నేత ఒకరు బాహాటంగానే చెప్పడం ఇక్కడ గమనార్హం.  జీవన్ రెడ్డి అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం సీనియర్లను కాపాడుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో  ప్రభుత్వం తరపున మంత్రి శ్రీధర్ బాబు ఇతర నేతలు శనివారం (మార్చి 21)  జీవన్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ వీడవద్దనీ, ఏ సమస్యైనా అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నచ్చ చెప్పారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఇసుమంతైనా మెత్తబడలేదు.   బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, ఆయన వర్గానికే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ పదవి దక్కడం వంటి పరిణామాలు జీవన్ రెడ్డి అసంతృప్తికి, ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. అలాగే  అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం సంజయ్ కుమార్ కు అనుకూలంగా ఉండటం,  ప్రభుత్వం కూడా  ఆయనకే ప్రాధాన్యత ఇస్తుండటం జీవన్ రెడ్డి ఇక కాంగ్రెస్ లో కొనసాగేది లేదన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు.  అదలా ఉంటే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు.  ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాల సమాచారం. 
ALSO ON TELUGUONE N E W S
• బన్నీ, ఎన్టీఆర్.. క్రేజీ మల్టీస్టారర్ లోడింగ్! • అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో ఆదిత్య ధర్ భారీ స్కెచ్ • మల్టీస్టారర్ సెట్ అయితే నెక్స్ట్ లెవలే • మళ్లీ తెరపైకి అదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు డైరెక్టర్ ఆదిత్య ధర్ చేరువలో ఉన్నారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్ 1300 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ధురంధర్2 ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 700 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సీక్వెల్.. త్వరలోనే కొత్త రికార్డులు సృష్టిస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, బన్నీలతో ఆదిత్య ధర్ ఒక మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో ఆగిపోయిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ను మళ్ళీ పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు ఆదిత్య. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఆదిత్య ఎప్పుడో సంప్రదించారు. అయితే కథా చర్చలు పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్‌లో పడింది. తాజాగా ‘ధురంధర్ 2’ చూసిన బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఆదిత్యపై ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడి ప్రతిభపై నమ్మకం కలగడంతో, ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో కనిపిస్తే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పవర్ ఫుల్ స్పెషల్ రోల్‌లో మెరుస్తారని ఇండస్ట్రీ టాక్. ఈ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు గనుక ఒక్క ఫ్రేమ్‌లో కనిపిస్తే ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆదిత్య ధర్ విజన్, తెలుగు స్టార్ల మాస్ ఇమేజ్ తోడైతే అది వెండితెరపై ఒక అద్భుతమే అవుతుంది.
  -ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ రిలీజ్  -చరణ్ పుట్టిన రోజున అప్ డేట్స్ వస్తాయా! -తెరపైకి వచ్చిన మృణాల్    అన్ని సినిమాల టీజర్లు, అన్ని సినిమాల పాటలు ఒకలా ఉండవని ఈ మధ్య కాలంలో నిరూపించిన చిత్రం 'పెద్ది'(Peddi). పైగా ఈ విషయంలో చాలా సినిమాలు 'పెద్ది'ని ఇన్ స్ప్రెషన్ తీసుకుంటున్నాయి. ఇక అభిమానులు, పాటల ప్రేమికులు అయితే డైలీ పెద్ది సాంగ్స్ ని వినకుండా తమ దినచర్యని స్టార్ట్ చేయడం లేదంటే నమ్మండి. ముఖ్యంగా 'రై రై రా' సాంగ్  అయితే ప్రతి ఒక్కరి లైఫ్ కి ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. దీంతో పెద్ది సినీ సొసైటీ పట్ల ఎంత సిన్సియర్ గా ఉంటాడో అర్ధమవుతుంది. రీసెంట్ గా 'పెద్ది' గురించిన ఒక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చాలా సిన్సియర్ గానే చక్కర్లు కొడుతుంది. మరి అదేంటో చూద్దాం. పెద్దిలో స్పెషల్ సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో చరణ్(Ram Charan)కి పోటీగా డాన్స్ చేసే ముద్దగుమ్మల  విషయంలో కొన్ని రోజుల నుంచి  పలు రకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌(Mrunal Thakur)పేరు వినిపిస్తుంది. వినిపించడం మాత్రమే కాదు చరణ్ తో ఆడిపాడటం ఖాయమనేది సినీ సర్కిల్స్ టాక్. మృణాల్ రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. సదరు పిక్స్ లో మృణాల్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా అర్ధమవుతుంది. అడవి శేష్ తో డెకాయిట్ చేస్తుంది కదా అందుకని ఉందని అనుకోవచ్చు. కానీ డెకాయిట్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఏప్రిల్ 10 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మృణాల్ తన పెద్ది బావ కోసమే ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి మృణాల్ గోల్డెన్ లెగ్ కూడా  పెద్దితో జత కడితే పెద్దిని ఆపడం ఎవరి తరం కాదు. Also read: Dhurandhar 2: ధురంధర్ 2 నిజమైన కలెక్షన్స్ ఇవే.. బాహుబలి, కల్కి,ఆర్ఆర్ఆర్ ని క్రాస్ చేసిందంటారా!  పెద్ది  ఈ నెల  27న తన పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. దీంతో అభిమానులు పెద్ది నుంచి ఎన్నో రకాలుగా ఆశిస్తున్నారు. ఆ ఆశలన్నిటిని తీర్చే దిశగా  దర్శకుడు బుచ్చిబాబు ఉన్నాడనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సాంగ్ కానీ టీజర్ కానీ రావచ్చేమో. దురాభిమానులకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే పెద్ది రిలీజ్ వాయిదా పడటం లేదు. ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. చరణ్ సరసన అచ్చాయమ్మాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor)కనిపిస్తుండగా ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)మిగతా సాంగ్స్ ద్వారా పెద్ది రేంజ్ మరింతగా పెంచాలని చూస్తున్నాడు. త్వరలోనే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది.   
దుమారం రేపిన చిరంజీవి కామెంట్స్  ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ మెగా కౌంటర్ అప్పుడు ఎందుకు నోరు మెదపలేదని సూటి ప్రశ్న ఇటీవల గద్దర్ అవార్డుల వేదికపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో దుమారాన్ని రేపాయి. సినీ కళాకారులను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్‌ వెనకబడిపోయిందని, నంది అవార్డులను పునరుద్ధరించాలని చిరంజీవి కోరారు. మెగాస్టార్ మాట్లాడిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా ఈ ఇష్యూపై సీనియర్ ప్రొడ్యూసర్ కాట్రగడ్డ(Katragadda Prasad) ప్రసాద్ స్పందించారు. 'తెలుగువన్ సినిమా'తో ఆయన మాట్లాడుతూ చిరంజీవి తీరుని తప్పుబట్టారు. ఒకరిని విమర్శించే ముందు గతాన్ని గుర్తుంచుకోవాలని, గతంలో చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు చేసిన మేలును ఎవరూ మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు.  హాట్ టాపిక్ గా కాట్రగడ్డ కామెంట్స్ హైదరాబాద్‌లో నేడు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇంతలా సెటిల్ అయ్యారంటే దానికి చంద్రబాబు వేసిన పునాదులే కారణమని కాట్రగడ్డ ప్రసాద్ గుర్తు చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో హీరోల ఇళ్లు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వంటి సంస్థలకు స్థలాలు దక్కడం వెనుక చంద్రబాబు కృషి ఉందని పేర్కొన్నారు. "అంతటి సహాయం చేసిన చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు, ఈ ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు నోరు మెదపలేదు?" అని ఆయన ప్రశ్నించారు. బహిరంగ వేదికపై ఎందుకు? సినిమా టిక్కెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వాల చుట్టూ తిరిగే పెద్దలు, పరిశ్రమ అభివృద్ధి కోసం లేదా ఏపీలో స్టూడియోల నిర్మాణం కోసం ఎందుకు ముందుకు రావడం లేదని కాట్రగడ్డ నిలదీశారు. ఏదైనా చెప్పాలనుకుంటే చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ద్వారా లేదా నేరుగా ముఖ్యమంత్రిని కలిసి అడగవచ్చని, కానీ బహిరంగ వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. చిన్న నిర్మాతల గోడు పట్టదా? కేవలం పెద్ద సినిమాల గురించే కాకుండా, నష్టాల్లో ఉన్న చిన్న నిర్మాతల గురించి ఏ రోజైనా ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడారా? అని ప్రసాద్ ప్రశ్నించారు. ఓటీటీ నిబంధనలు, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుదల వంటి అంశాలపై హీరోలు ఎందుకు స్పందించరని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో షూటింగ్ లొకేషన్లు ఎన్నో ఉన్నా, అక్కడికి వెళ్లి పరిశ్రమను డెవలప్ చేసే ఆలోచన ఎందుకు చేయడం లేదని అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఐటీ ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చారు కానీ, సినిమా వాళ్లు కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టలేదని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ నంది అవార్డుల వివాదం మునుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
- ‘ఉస్తాద్’ రిజల్ట్ చూశాక బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? - హరీష్ శంకర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్! - మాస్ డైరెక్టర్ డైలమా.. మల్టీస్టారర్ చేస్తారా?  గబ్బర్ సింగ్, మిరపకాయ్ వంటి కమర్షియల్ హిట్ సినిమాలతో మాస్‌లో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన, తాజాగా పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఫలితం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, కమర్షియల్ సక్సెస్ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ తదుపరి అడుగు ఎటువైపు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ తర్వాతి ప్రాజెక్ట్ నందమూరి బాలకృష్ణతో ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన బాలయ్యకు ఒక లైన్ కూడా వినిపించినట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం ఆశాజనకంగా ఉంటే ఈ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే అవకాశం ఉండేది. అయితే బాలకృష్ణ కేవలం హిట్, ఫ్లాపుల ఆధారంగా కాకుండా, దర్శకుడితో ఉండే ట్యూనింగ్ మరియు కథలోని బలాన్ని చూసి నిర్ణయాలు తీసుకుంటారు. మరి హరీష్ రాసుకున్న స్క్రిప్ట్ బాలయ్యను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి. మరోవైపు, హరీష్ శంకర్ దగ్గర 'దాగుడు మూతలు' అనే ఒక క్రేజీ మల్టీస్టారర్ కథ కూడా సిద్ధంగా ఉంది. గతంలోనే ఈ సినిమా గురించి వార్తలు వచ్చాయి. ఇందులో ఇద్దరు హీరోలు అవసరం కావడంతో, సరైన కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మల్టీస్టారర్ కుదరకపోతే, మళ్ళీ సోలో హీరో కోసం కొత్త కథను సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హరీష్ శంకర్‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఇప్పటికే వరుణ్ తేజ్ తో 'గద్దలకొండ గణేష్', సాయి ధరమ్ తేజ్ తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్' వంటి హిట్ సినిమాలు తీశారు. కాబట్టి వీరితో మరోసారి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సిద్ధంగా ఉన్న కథలకి ఏ హీరో సెట్ అవుతారో అన్న దానిపై ఆయన టీమ్ వర్క్ చేస్తోంది. నిజానికి హరీష్ శంకర్ సినిమాల్లో డైలాగ్స్ మరియు హీరో ఎలివేషన్స్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటాయి. ఉస్తాద్ విషయంలో కూడా పవన్‌ను చూపించిన విధానంపై ప్రశంసలు వస్తున్నాయి. అయితే కథా బలంలో కాస్త మార్పులు చేయాలని సోషల్ మీడియాలో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి బడా నిర్మాణ సంస్థలు ఇప్పటికే హరీష్‌కు అడ్వాన్సులు ఇచ్చి ఉండటంతో ఆయనకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, హరీష్ శంకర్ తన తర్వాతి సినిమాను చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ష్యూర్ షాట్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. బాలయ్య సినిమాపై క్లారిటీ వస్తే కానీ ఆయన నెక్స్ట్ స్టెప్ అధికారికంగా తెలిసే అవకాశం లేదు. త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
  -కలెక్షన్స్ సునామిని సృష్టిస్తున్న ధురంధర్ 2  -అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్  -నిజంగానే ఆ మూడు చిత్రాలని బీట్ చేసిందా! ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్.. ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే.. అప్పుడే అయిపోయిందనుకోకు ఇప్పుడే మొదలైంది. ఈ ఫేమస్ డైలాగ్స్ ధురంధర్ 2 (Dhurandhar 2)కి పర్ఫెక్ట్ గా వర్తిస్తాయి. లేకపోతే ఇవేం కలెక్షన్స్ అండి బాబు. జాలి, దయ అనే వర్డ్స్ కి ధురంధర్  డిక్షనరీలోనే చోటు లేదంటూ తన హవాని చాలా బలంగా చాటుతుంది. జోరు ఇలాగే కొనసాగితే ఇండియన్ సినీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సునామి ఫిగర్ నమోదవ్వడం ఖాయం. మరి ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందో చూద్దాం. నిన్నటితో అంటే నాలుగురోజులతో పాటు ప్రీమియర్స్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా 761 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దీంతో వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన  బాహుబలి 2 (591 కోట్లు) కల్కి (500 కోట్లు), ఆర్ఆర్ఆర్ (470 కోట్లు) రికార్డులు మొత్తం ఎంత పని చేసావు బాసు. మాకే ఎసరు పెడతావని అసలు ఊహించలేదంటు ధురంధర్ 2 కి వెల్ కమ్ చెప్పినట్లయింది. దీంతో భారతీయ సినీ చరిత్రలో వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సెకండ్ మూవీగా ధురంధర్  నిలిచింది. ఫస్ట్ మూవీ పుష్ప 2  762 కోట్లు. Also read: Renu desai: రేణు దేశాయ్ ఆయనకి అంధభక్తురాలంట.. ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మరి      ఈ విషయంలో పుష్ప 2 ని క్రాస్ చెయ్యకపోయినా ఏం పర్లేదని, వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ మూవీ లవర్స్, సెలబ్రటీస్  ధురంధర్ బాట పడుతుండటంతో లాంగ్ రన్ లో 2000 కోట్ల మార్కుని అందుకుంటుందనే అంచనాలైతే అందరిలో ఉన్నాయి. పుష్ప 2 టోటల్ రన్ లో 1780 కోట్ల దాకా రాబట్టిన విషయం తెలిసిందే.    
బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం 'ధురంధర్ 2'(Dhurandhar 2) ప్రభంజనం సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా గట్టి ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 26న థియేటర్లలోకి రాబోతున్న చిన్న సినిమాలకు ఈ 'ధురంధర్' వేవ్ పెద్ద సవాల్‌గా మారింది. టాలీవుడ్ నుంచి మార్చి 26న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’, మార్చి 27న ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించిన ‘సుయోధన’ విడుదల కానున్నాయి. ఈ వారం డబ్బింగ్ సినిమాల సందడి కూడా ఉంది. మార్చి 26న 'యూత్', మార్చి 27న 'హ్యాపీ రాజ్' థియేటర్లలో అడుగుపెట్టనున్నాయి. సమ్మర్ సీజన్ లో సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే పలు చిన్న సినిమాలు మార్చి చివరి వారంపై కన్నేశాయి. అయితే, ఇప్పుడు నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా.. ఊహించని విధంగా 'ధురంధర్ 2' వసూళ్ల సునామీ కొనసాగుతుండటంతో థియేటర్ల కేటాయింపులు, ప్రేక్షకుల ఆదరణపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 'ధురంధర్ 2'కి తెలుగులోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. దానికితోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. దీంతో ఈ వారం విడుదలయ్యే సినిమాలకు మౌత్ టాక్ చాలా కీలకం కానుంది. కంటెంట్ ఓ రేంజ్ లో ఉందనే టాక్ వస్తే తప్ప.. చిన్న సినిమాల వైపు ప్రేక్షకులు చూసే పరిస్థితి ఉండదు. 'ధురంధర్ 2' వేవ్‌ లో తమ సినిమాలను విడుదల చేయడం కరెక్ట్ కాదని కొందరు మేకర్స్ భావిస్తారు. ఈ క్రమంలోనే మార్చి 26న విడుదల కావాల్సిన సుడిగాలి సుధీర్ 'GOAT' సినిమాని వాయిదా వేసినట్లు సమాచారం. మొత్తానికి మార్చి ఆఖరి వారం బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికర పోరు చూడబోతున్నాం. మరి 'ధురంధర్ 2' తన జోరును ఇలాగే కొనసాగిస్తుందా? లేక కొత్తగా వచ్చే చిన్న సినిమాలు ఏమైనా సర్ ప్రైజ్ చేస్తాయా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.  
సీనియర్ నటి భానుప్రియ తల్లి లక్ష్మి(83) 22 మార్చి ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూసినట్టు ఆలస్యంగా అందిన సమాచారం. ‘సితార’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన భానుప్రియ. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించి ఒక దశలో టాప్ హీరోయిన్ అనిపించుకున్నారు. భానుప్రియ సోదరి శాంతి ప్రియ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి పేరు తెచ్చుకున్నారు.  భానుప్రియ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే తండ్రి పండుబాబు కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లిపోయారని తెలుస్తోంది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల్ని పెంచి సినిమాల్లో అవకాశాలు రావడానికి తోడ్పడ్డారు తల్లి లక్క్ష్మీ. భానుప్రియ, శాంతిప్రియలకు మాతృవియోగం జరిగిందన్న వార్తతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. 
- ప్రియదర్శన్-మోహన్ లాల్ అరుదైన మైలురాయి. - మలయాళ వెండితెరపై మరో అద్భుతం..  - ప్రియదర్శన్ ప్రతిష్టాత్మక 100వ చిత్రంలో లాలెట్టన్. మలయాళ సినీ పరిశ్రమలో మోహన్ లాల్ - ప్రియదర్శన్ లది విడదీయలేని బంధం. దశాబ్దాలుగా వెండితెరపై ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన ఈ ‘మ్యాజికల్ కాంబో’ ఇప్పుడు ఒక అరుదైన రికార్డును సృష్టించేందుకు సిద్ధమైంది. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. విశేషమేమిటంటే, ఈ మైలురాయి వంటి సినిమాలో మళ్ళీ మన ‘లాలెట్టన్’ మోహన్ లాలే హీరోగా నటిస్తున్నారు. సాధారణంగా ఒక దర్శకుడి ప్రయాణం ఎక్కడ మొదలైందో, వందో సినిమా దగ్గరకు వచ్చేసరికి సమీకరణాలు మారిపోతుంటాయి. కానీ ప్రియదర్శన్ విషయంలో మాత్రం అది రివర్స్ అయ్యింది. ఆయన 1984లో ‘పూచక్కోరు మూక్కుతి’ అనే సినిమాతో మెగాఫోన్ పడితే, ఆ చిత్రంలో హీరో మోహన్ లాల్. ఇప్పుడు సరిగ్గా వంద సినిమాలు పూర్తి చేసుకుంటున్న వేళ కూడా అదే హీరోతో జతకట్టడం ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టమని సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. కొన్ని మైలురాళ్లు ఒక్కరికి మాత్రమే పరిమితం కావని, ఆ ప్రయాణంలో తోడున్న ప్రతి ఒక్కరికీ దక్కుతాయని ఆయన పేర్కొన్నారు. తన ప్రియ మిత్రుడు ప్రియన్ వందో అడుగులో తాను కూడా భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు లాలెట్టన్ తన మనసులోని మాటను పంచుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కాలాపానీ’, ‘చిత్రం’, ‘కిలుక్కం’, ‘మిన్నరం’ వంటి చిత్రాలు మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం సంచలనం సృష్టించాయి. మొన్నటికి మొన్న వచ్చిన ‘మరక్కార్’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ ద్వయం, ఇప్పుడు చేయబోయే 100వ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ భారీ వ్యయంతో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మలయాళంతో పాటు పలు భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు మోహన్ లాల్ అభిమానులు, అటు సినీ ప్రియులు ఈ కాంబో నుండి మరో మాస్టర్ పీస్ ఆశిస్తున్నారు. ప్రియదర్శన్ ‘సెంచరీ’ కొట్టడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులు తిరగరాయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.
    -వైరల్ గా మారిన రేణుదేశాయ్ పోస్ట్  -ఎందుకు ఎలా చేసింది  -ఆ వ్యాఖ్యలు సరైనవేనా!  రేణుదేశాయ్(Renudesai).. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మాజీ వైఫ్ గా, నటిగా, సామాజిక వేత్తగా, జంతుప్రేమికురాలిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తన స్థానం శాశ్వత చిరునామా. అసలు రేణు దేశాయ్ సందడి లేని సోషల్ మీడియా, సోషల్ మీడియానే కాదు అనుకునే పరిస్థితి. అంతలా నెట్టింట తన హవా కొనసాగుతూ వస్తుంది. ఇదే కోవలో రీసెంట్ గా ఆమె చేసిన పోస్ట్ కొత్తగా రెక్కలు వచ్చినా గూటిలోని గువ్వ పిల్లకి అనే రీతిలో వైరల్ హోదాలో తన స్టార్ డమ్ కొనసాగిస్తోంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. రేణుదేశాయ్ రీసెంట్ గా ధురంధర్ 2(Dhurandhar 2) ని వీక్షించడం జరిగింది. అనంతరం 'ఎక్స్' వేదికగా స్పందిస్తు 'నేను బీజేపీకి, దేశ‌ ప్రధాని మోదీకి గర్వించదగ్గ అంధభక్తురాలిని. దేశం కోసం ప్రాణాలర్పించే సాయుధ దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల పట్ల కనీస గౌరవం లేకుండా, దేశం గురించి తప్పుగా మాట్లాడే వారు ఖచ్చితంగా ‘ధురంధర్’ సిరీస్ చూడాలనే వ్యాఖ్యలు చేసింది. పార్ట్ 2 లో మోదీ గురించి దావూద్ ఇబ్రహీం క్యారక్టర్ మాట్లాడుతు ఈ ఛాయ్‌వాలా భారత్‌లోకి వచ్చాక మనవాళ్లలో భయం పెరిగిందని చెప్పే డైలాగ్‌ని  రీ షేర్ చేసింది. Also read: ఓటిటిలో హిట్.. చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు ఇక ధురంధర్ 2 తన కలెక్షన్స్ సునామీని కొనసాగిస్తు 750 కోట్ల గ్రాస్ మార్కుని దాటింది. తెలుగు లాంగ్వేజ్ లోను అంబాటులో ఉన్న విషయం తెలిసిందే.    
- సోషల్ మీడియా వైరల్ వార్తలపై బాలాజీ రియాక్షన్! - అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్! - సస్పెన్స్‌కు తెరదించిన ఆర్జే బాలాజీ! కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న 'సూర్య 45' (తాత్కాలిక టైటిల్) పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి టాలెంటెడ్ నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా కథ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ కథను ఆర్జే బాలాజీ మొదట దళపతి విజయ్ కోసం రాశారని, ఆయన రిజెక్ట్ చేయడంతో సూర్య దగ్గరకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జే బాలాజీ ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఒక కథను ఒకరి కోసం రాసి మరొకరితో చేయడం సహజమేనని, అయితే సూర్యతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మాత్రం పూర్తిగా ఆయన కోసమే సిద్ధం చేసినట్లు తెలిపారు. విజయ్ కోసం గతంలో కొన్ని కథలు వినిపించిన మాట వాస్తవమే కానీ, ప్రస్తుతం పట్టాలెక్కిన ఈ 'కరుపు' (Karuppu) మూవీ స్క్రిప్ట్ మాత్రం కేవలం సూర్య ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందని స్పష్టం చేశారు. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ సుమారు 18 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'ఆరు' సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నారు. ఆర్జే బాలాజీ గతంలో 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సూర్య వంటి మాస్ హీరోను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, సినిమా మేకింగ్ వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సూర్య అభిమానులు ఆయన రాబోయే చిత్రాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 'కరుపు' చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోందని, త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. సూర్య పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, ఆర్జే బాలాజీ మేకింగ్ స్టైల్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.