TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మామిడి తోటకు జెడ్-ప్లస్ భద్రత…ఎందుకంటే ?

Published on: Tue Apr 21, 2026 5:16PM

 

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక మామిడి తోట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణ మామిడి తోట కాదు ఇది… ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకాలలో ఒకటైన “మియాజాకీ” మామిడి పండ్లు ఇక్కడ పండుతున్నాయి. ఈ పండ్ల విలువ అంత ఎక్కువగా ఉండటంతో, వాటిని కాపాడేందుకు యజమాని జెడ్-ప్లస్ తరహా భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఈ తోటలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో 1000కి పైగా మామిడి చెట్లు ఉన్నాయి. అయితే అందులో ప్రత్యేకంగా మియాజాకీ రకం పండ్లకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మామిడి పండ్ల ధర కిలోకు రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఈ పండ్లు దొంగల దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు కఠిన భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ తోట వద్ద 3 మంది భద్రతా సిబ్బంది, 9 కుక్కలు నిరంతరం కాపలా కాస్తున్నాయి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్పందించేలా ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశారు. మియాజాకీ మామిడి పండ్ల ప్రత్యేకత కూడా విశేషమే. ఇవి సాధారణ మామిడి పండ్లలా కాకుండా ఎరుపు రంగులో మెరిసిపోతాయి. తీపి రుచి, సుగంధం వీటి ప్రత్యేక ఆకర్షణ. అంతేకాకుండా, ఈ పండ్లను పూర్తిగా ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతున్నారు. అత్యంత ఖరీదైన ఈ మామిడి పండ్ల కోసం ఇంతటి భద్రత ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. విలువైన పంటను కాపాడుకోవడానికి రైతులు తీసుకుంటున్న చర్యలకు ఇది ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలుస్తోంది.