రోజాకు కీలక పదవి.. వద్దన్నా పదవిచ్చిన జగన్
posted on Jun 12, 2019 2:10PM
ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా పదవి మీద స్పష్టత వచ్చింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ లేదా ఆర్టీసి చైర్ పర్సన్ గా ఆమెను నియమిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్గా రోజాను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
జగన్ మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో రోజా తీవ్ర నిరాశకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆమె మంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కాలేదు. అయితే, ఆ తర్వాత జగన్ ఆమెను తాడేపల్లికి పిలిపించారు. ఆమెతో మంగళవారం తొలుత విజయసాయి రెడ్డి, ఆ తర్వాత జగన్ మాట్లాడారు. తనకు ఏ పదవీ అక్కర్లేదని ఆమె వారితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఆమెను కీలకమైన ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.