ఎంపీలతో రాజీనామాలు చేయిస్తా..జగన్
posted on Oct 25, 2016 2:53PM
వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో యువభేరి నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాన్ని గురించి యువతకు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు ప్రత్యేక హోదాపై మాట్లాడిన నాయకులు ఈ రోజు మరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నది వాస్తవమని.. పరిశ్రమల కోసం అప్పుడు హోదా కావాలి అన్న నాయకులే మాటమార్చి ఇప్పుడు హోదాతో పరిశ్రమలు, ఉద్యోగాలకు సంబంధం లేదని చెబుతున్నారని ఆయన అన్నారు. ఆ రోజు మాటిచ్చి రాష్ట్రాన్ని విడగొట్టారని, పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని అన్నారు. విశ్వాసం, విశ్వసనీయత లేకుండా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. మాట తప్పిన నేతలను ప్రజలు గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ సమావేశాల్ని సైతం స్తంభింపజేస్తామని.. ఎంపీలతో రాజీనామాలు సైతం చేయిస్తామని చెప్పారు.