కుంటిసాకులతో సభకు మొహం చాటేసిన వైకాపా
posted on Jan 17, 2014 1:46PM
రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు ఒంటరి పోరాటం చేస్తున్నామని చెప్పుకొంటున్నవైకాపా శాసనసభలో తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పి తెలంగాణా బిల్లుని తీవ్రంగా వ్యతిరేఖించకుండా, బిల్లుపై ఓటింగ్ ఉంటుందా లేదా? అనే విషయంపై స్పష్టత లేని కారణంగా సభ నుండి వాకవుట్ చేసి కీలకమయిన చర్చలో పాల్గొనకుండా తప్పించుకొంది. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సభలో ప్రసంగిస్తూ, అధికార, ప్రతిపక్షాలు కలిసి రాష్ట్ర విభజనకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు రాష్ట్ర విభజనపై ముందు తమ వైఖరి తెలియజేసి ఆనక చర్చలో పాల్గొంటే బాగుంటుందని ఆమె అన్నారు. అవి రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నాయి గనుకనే టీ-బిల్లుపై చర్చలో పాల్గొంటున్నాయని, చర్చలో పాల్గొనడమంటే విభజనకు అంగీకరిచడమేనని, అందువల్ల తాము వాకవుట్ చేస్తున్నామని చెప్పి, తమ పార్టీ సభ్యులతో సహా ఆమె సభ నుండి నిష్క్రమించారు.
వైకాపా నిజంగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నట్లయితే, సభలో గట్టిగా వాదించి టీ-బిల్లుని అడ్డుకొనే ప్రయత్నం చేసి ఉండాలి. కానీ, పార్టీకి మనుగడకి రాష్ట్ర విభజన జరగడం అత్యవసరం గనుకనే బిల్లుకి అడ్డుపడకుండా కుంటిసాకులు చెప్పి చర్చలో పాల్గొనకుండా తప్పుకొంటోంది.