'కమ్మ'తనంపై దృష్టి పెట్టిన జగన్
Published on: Tue May 1, 2012 10:20AM
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కమ్మనాయకుల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న ఈ సామాజికవర్గంలో కొందరినైనా తమ పార్టీలోకి రప్పించగలిగితే బాగుంటుందన్న అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒంగోలు, గుంటూరు, సర్సారావుపేట, విజయవాడ, ఖమ్మం, సికింద్రాబాద్, ఏలూరు, విశాఖ వంటి పార్లమెంటు స్థానాలను కమ్మసామాజిక వర్గీయులకు కేటాయించి టిడిపి ఓటుబ్యాంకుకు గండి కొట్టాలన్న వ్యూహంతో జంగాన్ ఉన్నట్లు తెలుస్తోంది.
కమ్మవర్గం తమతో ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి రాగలుగుతానని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణాజిల్లాలో కమ్మవర్గాన్ని ఆకట్టుకునేందుకు జగన్ చేసిన ప్రయత్నం ఫలించబోతోంది. వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి కేడర్ పుష్కలంగా ఉన్న నాయకులను జగన్ ఇప్పటికే సంప్రదించారు. విజయనగరం జిల్లాలో కమ్మవర్గానికి చెందిన గద్దె బాబూరావు టిడిపికి గుడ్ బై చెప్పి జగన్ పంచన చేరారు. శృంగవరపు కోట నియోజకవర్గానికి చెందిన కమ్మసామాజికవర్గ నేత ప్రకాష్ బాబు కూడా జగన్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది.
టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కూతురుకు వినుకొండ అసెంబ్లీసీటు, సర్సారావుపేట పార్లమెంట్ సీటు తిరుమల డెయిరీ చైర్మన్ బ్రహ్మనాయుడుకు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. చంద్రబాబునాయుడు తీరుపట్ల కొందరు కమ్మవర్గీయులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి నాయకులతో మంతనాలు జరిపే పని తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నలుగురు నాయకులకు జగన్ అప్పగించినట్లు తెలిసింది.


