విజయవాడలో వైకాపా ప్రధాన కార్యాలయం

 

త్వరలో వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్టీ అభిమానులకు, ఇరు రాష్ట్రాలలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలకు మరింత చేరువయ్యేందుకు గాను త్వరలోనే పార్టీ తరపున ఒక మాసపత్రిక మరియు నెట్-టీవీ కూడా మొదలుపెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. షర్మిల నేతృత్వంలో వైకాపా మళ్ళీ తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది కనుక ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కార్యాలయాన్నే తెలంగాణా రాష్ట్రానికి ప్రధాన కార్యాలయంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహించవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొనేందుకు సిద్దమవుతోంది. అయితే అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంతవరకు అటువంటి సూచనలేవీ చేయకపోవడం విశేషం. కానీ తెదేపాను జాతీయాపార్టీగా మార్చబోతున్నందున త్వరలోనే ఆ పార్టీ కూడా విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది.