యాత్రలో విజయమ్మ మమేకం..ఆయనే కనిపించారు

 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకొని యాత్ర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఇటీవలే విడుదల అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. అందరి మన్ననలు పొందుతుంది. కాగా ఈ చిత్ర యూనిట్‌ను రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అభినందించారు. ఈరోజు ఆమె ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని తిలకించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. యాత్ర సినిమాను చాలా బాగా తీశారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను యాత్ర రూపంలో తెరకెక్కించిన తీరు చాలా బాగుంది. ఆయన సజీవంగా మనముందు లేకపోయినా... యాత్ర చిత్రం ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని మరోసారి ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసంరాజశేఖర్ రెడ్డి కట్టుబడేవారని ఆమె తెలిపారు. రాజశేఖర్ రెడ్డిని ప్రజలందరూ ఆదరించారని, ఇప్పుడు వారి పిల్లలను కూడా ప్రజలు ఆదరిస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ కు, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.