వైఎస్ షర్మిల యాత్రకు సమైక్య సెగ
posted on Sep 5, 2013 2:48PM
సమైక్య శంఖారావం పేరుతో తిరుపతి నుండి యాత్ర మొదలు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిల యాత్రకు అనంతపురం జిల్లా పామిడిలో బ్రేక్ పడింది. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు షర్మిల యాత్రను అడ్డుకుని గోబ్యాక్ షర్మిల నినాదాలు చేశారు. దీంతో కంగుతిన్న షర్మిల మరో దారిలో కర్నూలు వైపు వెళ్లిపోయారు.
తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత సమన్యాయం అని దీక్షలకు దిగి ఆ తరువాత సమైక్య వాదం అందుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ అనంతపురంలో యాత్రకు అడ్డుపడడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఇక నెల్లూరులో జరుగుతున్న సింహగర్జన కార్యక్రమానికి వచ్చిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని సమైక్యవాదులు అడ్డుకుని వెనక్కి పంపించడం విశేషం. ఇక్కడ రాజకీయ నాయకులతో పనిలేదు అని వారు తేల్చిచెప్పారు.