జైలు నుంచి వైఎస్ జగన్ విడుదల
posted on Sep 24, 2013 4:04PM
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.16 నెలలుగా చంచల్గూడ జైళులో ఉంటున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ రావడంతో బయటకి వచ్చారు. జగన్ కు సోమవారమే సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పూచీకత్తులు సమర్పించడానికి సమయం లేకపోవడంతో, మంగళవారం ఉదయం జగన్ లాయర్లు ఆ పని పూర్తి చేశారు.
జగన్కు ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి, యశ్వంత్ రెడ్డిలు పూచీకత్తులు ఇచ్చారు. జగన్ వ్యక్తిగత పూచీకత్తు తీసుకున్న కోర్టు జైలు నుండి విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వు కాపీలను జగన్ లాయర్లు చంచల్ గూడ అధికారులకు సమర్పించడంతో మధ్యాహ్నం జగన్ జైలు నుండి బయటకు వచ్చారు. పట్టువదలని విక్రమార్కుడిలా తొమ్మిది సార్లు బెయిల్ కోసం కోర్టు మెట్టెక్కిన జగన్ చివరకు అనుకున్నది సాదించాడు.