చంద్రబాబు జగన్ సవాల్.. దానికి సిద్దమా...?

 

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం కామనే. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా చంద్రబాబుపై పడిపోతుంటారు. ఇప్పుడు మరోసారి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి ప్రస్తావించి జగన్ చంద్రబాబుకు ఓ సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్దామని, ఆ ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా? అని చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నది చంద్రబాబే.. పోలీసులు, డబ్బు వారి దగ్గరుందని, అయినా ప్రజల మద్దతు ఎవరికో తేల్చుకుందామని అన్నారు. ప్రశ్నించే విపక్షం లేకుండా చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని, విలువలతో కూడిన రాజకీయాలను ఆయన ఎన్నడో వదిలేశారని నిప్పులు చెరిగారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న చంద్రబాబుకు, ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరి జగన్ సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తారో లేదో చూడాలి.