జగన్ బెయిల్ తో సీమాంద్రలో సంబరాలు
posted on Sep 24, 2013 11:05AM
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డికి బెయిలు మంజూరు కావడంతో పెద్దఎత్తున సంబరాలు మొదలయ్యాయి. కడపలో పార్టీ కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకుంటూ భారీగా బాణసంచా కాల్చారు. కోటిరెడ్డి సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించి టపాసులు పేల్చారు. కలెక్టరేట్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు నిర్వహించారు. ప్రొద్దుటూరులో వేడుకలతోపాటు రంగులు చల్లుకున్నారు. మండల కేంద్రాల్లో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.
కర్నూలు జిల్లా కేంద్రంలో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచారు. డప్పులు మోగిస్తూ ర్యాలీగా వెళ్లి ఎస్వీ కాంప్లెక్స్వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతపురం జిల్లాలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి జగన్కు జేజేలు కొడుతూ ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున బాణసంచా పేల్చి, రంగులు చల్లుకుంటూ ర్యాలీలు నిర్వహించారు.
తిరుపతిలో వైఎస్ విగ్రహంవద్ద సంబరాలతోపాటు రంగులు చల్లుకున్నారు. పలమనేరులో జాతీయ రహదారిపై బహిరంగ సభ, పీలేరులోనూ క్రాస్రోడ్డుపై సంబరాల వల్ల వాహనాల రాకపోకలకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలో పలుచోట్ల కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ తదితర ప్రాంతాల్లో రంగులు చల్లుకుంటూ 'జై జగన్' నినాదాలు చేశారు. విజయవాడలో గుణదల మేరీ మాత గుడి వద్ద ప్రత్యేక ప్రార్థనలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.