20 వేల ఓట్ల తేడాతో నారా లోకేష్ ఓడిపోతారు

 

ఏపీలో ఎన్నికలైతే ముగిశాయి కానీ ఫలితాలకు చాలా సమయముంది. అయితే ప్రధాన పార్టీ నేతలు ఎవరికివారు అధికారం మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఫలితాలు రావడం, జగన్ ప్రమాణ స్వీకారం చేయడమే అన్నట్లు చెప్తున్నారు. ఇక చంద్రబాబు కూడా తమ పార్టీకి 130 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ.. జాతీయ స్థాయిలో మోదీ వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా బాబు 130 సీట్ల వ్యాఖ్యలపై వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పని అయిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. తన అంచనా ప్రకారం టీడీపీ 13 సీట్ల కంటే ఎక్కువ, 25 సీట్ల కంటే తక్కువగా గెలుస్తుందన్నారు. అంతేకానీ 130 సీట్లు వచ్చే ఛాన్స్ లేదన్నారు. 130 సీట్లు వస్తాయని చంద్రబాబు, ఆ పార్టీ నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్‌ స్థానాల్లో టీడీపీ బోణి కొట్టదన్నారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో మంత్రి నారా లోకేష్ ఘోరంగా ఓడిపోతారని చెప్పుకొచ్చారు. ఆర్కే చేతిలో సుమారు 20 వేల ఓట్ల తేడాతో లోకేష్ పరాజయం పాలవుతారన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తుందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.