TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిట్టింగ్ స్థానాల్లోనూ పట్టు కోల్పోతున్న వైైసీపీ?!

Published on: Fri Apr 24, 2026 3:55PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి, వచ్చే ఎన్నికలలో ఆ సంఖ్యైనా మిగులుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులలోనే వ్యక్తమౌతున్న పరిస్థితి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం..  వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాల్లో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గెలవడం సాధ్యం కాదని అంటున్నారు.   సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గత ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గాలలో.. కనీసం నాలుగింటిలో ఇప్పుడు వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి పులివెందుల తరువాత అంతటి సురక్షిత స్థానంగా చెప్పుకునే పుంగనూరులో ఆ పార్టీ ప్రస్తుతం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని తెలుస్తోంది. పుంగనూరు పుడింగిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఎన్నికలలోనే చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించారు. 2024 ఎన్నికలలో పెద్దిరెడ్డికి పుంగునూరులో వచ్చిన మెజారిటీ కవేలం 6వేల ఓట్లు మాత్రమే. అయితే ప్రస్తుతం చూస్తే.. ఆ నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని అంటున్నారు. పెద్దిరెడ్డి కేవలం వ్యాపారాలు, కోర్టు కేసులకే పరిమితమై ప్రజలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక  కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సుధ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆమె పనితీరు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికలలో బద్వేలు వైసీపీ చేజారడం ఖాయమని చెబుతున్నారు.  

అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో కూడా వైసీపీకి గడ్డుపరిస్థితులే నెలకొని ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు.  అయితే.. ఆయన నియోజకవర్గ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది. మరో వైపు తెలుగుదేశం నేత గొట్టిపాటి రవి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. దీంతో వైసీపీ నియోజకవర్గంలో పట్టు కోల్పోయిన పరిస్థితి ఉందని అంటున్నారు. . 

ఇక అరకు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రేగం మత్స్యలింగం ఇ విజయం సాధించారు. అయితే ఆయన కూడా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదనీ, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు క్షేత్రస్థాయిలో చురుకుగా, చొరవగా పని చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో అరకులో కూడా ఆ పార్టీకి మరో చాన్స్ దక్కే అవకాశాలు అంతంతమాత్రమే అంటున్నారు.  

అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. ఒక సారి పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టగానే, గాలి వైసీపీవైపు మళ్లడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో, ప్రజలలో వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తి ఉన్నమాట నిజమే అయినా..
జగన్ మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే పాదయాత్ర  దానిని పటాపంచలు చేస్తుందనీ, మళ్లీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది.   అయితే పరిశీలకులు మాత్రం ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుని ప్రజలతో మమేకం కాకుండా వైసీపీ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు.