TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బంగారుపాళ్యంలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు

Published on: Wed Jul 9, 2025 12:14PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. జగన్ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఆ షరతుల మేరకు మార్కెట్ యార్డులో 500 మందికి, హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యంలో ఎలాంటి అల్లర్లకు చోటులేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తుగా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కావాలనే ఆంక్షలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని   హెచ్చరించారు.

అయితే పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా సృష్టించారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్‌ యార్డ్‌లోకి మరీ వైసీపీ కార్యకర్తలు చొచ్చుకువెళ్లారు  వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

బంగారు పాళ్యంలోని హెలిప్యాడ్‌కి జగన్ రెడ్డి చేరుకునే సరికి హెలి‌ప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా ఎగబడ్డాయి. వారిని కంట్రోల్ చేయలేక పోలీస్‌లు చేతులు ఎత్తేస్తున్నారు. వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో తోపులాట జరిగింది. హెలి‌ప్యాడ్ వద్ద తొక్కిసలాటతో పరిస్థితి గందరగోళంగా మారింది. వైసీపీ నేతల వైఖరితో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా వైసీపీ  మూకలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.