వైసీపీలో పెరుగుతున్న ధిక్కారం..మళ్లీ అధికారంపై ఎమ్మెల్యేలలో ఆవిరైన నమ్మకం
Published on: Wed Aug 3, 2022 10:05PM
ఒక వైపు స్వయంగా చేయించుకున్న సర్వేలే జగన్ కు దిమ్మతిరిగేలా చేస్తుంటే.. మరో వైపు పార్టలో ఎమ్మెల్యేల ధిక్కార స్వరాలు గట్టిగా వినిపించడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం మెజారిటీ ఎమ్మెల్యేలలో లేదన్న మాట ఆ పార్టీ శ్రేణుల నుంచే వినవస్తున్నది. అందుకే పార్టీయా గాడిద గుడ్డా.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసు అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలే పార్టీపై తమకు విశ్వాసం లేదని విస్ఫష్టంగా చెప్పేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ లేదు.. గాడిద గుడ్డూ లేదని ఆయన తన ధిక్కార స్వరాన్ని గట్టిగా వినిపించారంటున్నారు. దాదాపు ఇటువంటి వ్యాఖ్యలే పలువురు ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డుగా మీడియాతో చెప్పారని కూడా అంటున్నారు. ఇక జగ్గయ్య పేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు విషయానికి వస్తే..ఆయన సొంత పార్టీపైనే విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసునని ఆయన అన్నట్లు చెబుతున్నారు. తాను వైసీపీలో శాశ్వతంగా ఉండబోవడం లేదని ఆయన తన సన్నిహితుల దగ్గర పేర్కొన్నారనీ, ఏదో ఉన్నంత వరకూ బాధ్యతగా పని చేయడమే తన పని అన్నారు. పింఛన్ తీసుకునే సామాన్యులు ఆదాయ పన్ను ఎలా కట్టగలరని ఆయన తమ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు.
కాగా జ్యోతుల చంటిబాబు గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి నుంచి వైసీపీలో చేరారు. 2009లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఇక 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ తరువాత 2019లో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు చంటి బాబు తెలుగుదేశం వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి.


