నాకు పదవి ఇచ్చారా?.. ఏమో నాకు తెలీదు: రోజా
posted on Jun 13, 2019 1:03PM
ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నగరి ఎమ్మెల్యే రోజాను నియమిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే రోజా మాత్రం దీనిపై స్పందిస్తూ.. ‘ఏమో నాకైతే ఎటువంటి సమాచారం లేదు’ అంటూ అందరికీ షాకిచ్చారు.
జగన్ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో రోజా అలకపాన్పు ఎక్కారన్న వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సీఎం జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈరోజు అసెంబ్లీ సమవేశాలకు హాజరైన రోజా మీడియాతో మాట్లాడుతూ.. పదవిపై నాకైతే ఎటువంటి సమాచారం లేదని వ్యాఖ్యానించడంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు. అయితే సీఎం జగన్ తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించి ఆయనకు మంచి పేరు తీసుకొస్తానని రోజా చెప్పారు.