ఏడుపుగొట్టు ముఖాలతో ఇంట్లోనే ఉండండి బాబు అండ్ బ్యాచ్.. రోజా సెటైర్లు

ఏపీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపటం పట్ల నగరి ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని నమ్మి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారని రోజా తెలిపారు. ఈ బిల్లుల ఆమోదంతో ఒక్క ఉత్తరాంధ్ర ప్రజలే కాక రాయలసీమ, అమరావతి ప్రాంత రైతులు తో సహా అందరూ సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు. ఇక దీంతో ఏమాత్రం సంతోషంగా లేనిది కేవలం చంద్రబాబునాయుడు, లోకేష్ అండ్ కో బ్యాచ్ అని విమర్శించారు.

గతంలో అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరణ చెయ్యటం వల్ల తెలంగాణ ఆంధ్ర విడిపోయాక ఏపీ ప్రజలు దిక్కులేని పరిస్థితి లో పడ్డారని కానీ సీఎం జగన్ నిర్ణయంతో భవిష్యత్ లో మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆమె తెలిపారు. ఇదే సమయంలో అమరావతి ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరగదని, గత ప్రభుత్వం ఇక్కడి ప్రజలను మోసం చేసిందని ఆమె విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు లోకేష్ లు ఏడుపు ముఖాలు వేసుకుని ఇంట్లోనే ఉండాలని అలా కాకుండా బయటకు వచ్చి అభివృద్ధి ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఏమాత్రం సహించరని ఆమె హెచ్చరించారు.