దరఖాస్తు పెట్టుకో.. సెంటు స్థలం ఇస్తాం: వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

 

రాజధానిని మార్చాలని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే.. ప్రకాశం గేట్లు ఎత్తకుండా వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ వరదలతో రాజకీయం చేస్తుందని.. టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖండించారు. టీడీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కృష్ణా నదికి వస్తున్న వరదపై కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ఆళ్ల తెలిపారు. వరద సమాచారాన్ని సంబంధిత అధికారులు వాట్సాప్ ద్వారా ప్రతీ గంటకు పంచుకుంటున్నారని వెల్లడించారు. అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని చెప్పారు. అలాంటిది మాజీ మంత్రి దేవినేని ఉమా కావాలనే కృత్రిమ వరదను ప్రభుత్వం సృష్టించిందని చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే టీడీపీ నేతలు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతుందని 
ఆళ్ల మండిపడ్డారు. 

"అయ్యా దేవినేని ఉమా గారూ.. ఓటుకు నోటు కేసులో విచారణ ప్రారంభం కాకముందే హైదరాబాద్ నుంచి పారిపోయారు. చంద్రబాబు వారికి చిక్కకుండా ఉండేందుకు ఇంటి కోసం మీరు పడవ వేసుకుని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిలో తిరిగారు. అప్పుడు ఇవన్నీ అక్రమ నిర్మాణాలేననీ, వీటిని తొలగిస్తామని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి." అని ఆళ్ల నిలదీశారు.

ఐదేళ్లలో ప్రపంచస్థాయి రాజధాని కడతామని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ చంద్రబాబు రాజధాని ప్రాంతంలో సెంటు భూమి కొన్నారా? సొంత ఇల్లు ఉందా? అని ప్రశ్నించారు. మీరు అమరావతి రాజధాని అని ప్రకటించగానే అప్పటి ప్రతిపక్ష నేత జగన్  అక్కడే ఇల్లు, ఆఫీసు కట్టుకున్నారు. అంటే రాజధాని నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉన్నట్లా? లేక జగన్ కు చిత్తశుద్ధి ఉన్నట్లా? అని నిలదీశారు. 

చంద్రబాబుది అక్రమ నివాసమే. ఆయన నివాసంలోని వాహనాలను హ్యాపీ రిసార్ట్స్ కు, ఫర్నీచర్ ను ఇంటిలోని మొదటి ఫ్లోర్ కు తరలించారు. "ఈ విషయమై చంద్రబాబు మీడియా ముందుకు రాకుండా ఇతరులతో మాట్లాడించడం భావ్యం కాదు. చంద్రబాబు తనకు ఇల్లు లేదనీ, వాచీ, ఉంగరం లేదని చెబుతున్నారు. మా అధినేత జగన్ వచ్చే ఉగాది నుంచి ఇల్లు లేని వారందరికి పక్కా ఇళ్లు మంజూరు చేయబోతున్నారు. దరఖాస్తు పెట్టుకో. మీ దగ్గరకు కూడా మా వాలంటీర్ వస్తాడు. సెంటో, సెంటున్నరో స్థలం ఇస్తారు. లేదా మీరు లక్షల కోట్ల అవినీతి చేశారు కదా.. ఆ డబ్బులు కట్టుకున్నా ప్రభుత్వం మీ ఇంటికి భద్రతను కల్పిస్తుంది" అని ఆళ్ల వ్యాఖ్యానించారు.