TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సొంత పార్టీ వారే కుట్ర చేస్తున్నారు.. బాలినేని సన్సేషన్

Published on: Tue Jun 28, 2022 11:12AM

వైకాపాలో ప్రాధాన్యత కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి తనపై సొంత పార్టీ వారే కుట్ర పన్నుతున్నారంటే సన్సేషనల్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవి కోల్పోయిన తరువాత నుంచి పార్టీలో బాలినేని ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. టీడీపీ నేతలు బాలినేనిపై చేస్తున్న విమర్శలను ఖండించే విషయంలో పార్టీ వారి నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. దీంతో బాలినేని రగలిపోతున్నారు. తనను లక్ష్యం చేసుకుని తెలుగుదేశం చేస్తున్న విమర్శలకు సొంత పార్టీవారే వత్తాసుగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని అనుమానిస్తున్నారు.

ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా వెల్లడించి సంచలనం సృష్టించారు. తనకు వ్యతిరేకంగా సొంత పార్టీవారే కుట్ర చేస్తున్నారనీ, ఇది చాలా సిగ్గు చేటైన విషయమని అన్నారు. వారెవరో తనకు తెలుసుననీ, ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ కు వారిపై ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు.

అల్లూరులో కవిత అనే మహిళ కుటుంబ కలహాలను అడ్డుపెట్టుకుని తనపై బురద జల్లారని ఆరోపించారు. తెలుగుదేశం వారితో కుమ్మక్కై వైసీపీలోని కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని బాలినేని చేసిన ఆరోపణ వైసీపీలో కలకలం సృష్టించింది.

అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం గతంలో తాను చెలాయించిన పెత్తనం కారణంగానే ఒంగోలులో వైసీపీ కార్యకర్తలు ఆయనకు దూరమయ్యారని అంటున్నారు. బాలినేనిపై కుట్ర చేయాల్సిన అవసరం వైసీపీలో ఎవరికీ లేదనీ అంటున్నారు.