ఏపీ మంత్రి నాని అనుచరుడి దారుణ హత్య

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత హత్య కలకలం రేపింది. మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యాడు. మునిసిపల్ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కరరావుని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. గాయపడిన భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కత్తి పోటు ఛాతీలో బలంగా దిగడంతో భాస్కర్ రావు గుండెకు బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. కత్తికి సైనేడ్ పూసి పొడిచినట్టు వైద్యులు భావిస్తున్నారు. 

భాస్కరరావు గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డు చైర్మన్‌గా పని చేశాడు. పాతకక్షల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  మరోవైపు, భాస్కరరావు మరణవార్త తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు.