వైసీపీకి రోజా జెల్ల... మంత్రిపదవి?

 

వైసీపీ జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా.. అసెంబ్లీ సమావేశాలపై ఆదివారం లోటస్ పాండ్ నివాసంలో నిర్వహించిన సమావేశానికి సినీ నటి రోజాతో పాటు.. 20 మంది ఎమ్మెల్యేల వరకు డుమ్మా కొట్టినట్టు సమాచారం. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ ఏర్పాటు చేసిన సమావేశం పార్టీ శానససభ్యులు హాజరు కాకపోవడంతో జగన్ వారి కోసం ఎదురుచూసి 2 గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఈ సమావేశానికి హాజరుకాని వారిపై పుకార్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీలో కీలక నాయకురాలిగా వున్న రోజా కూడా ఈ సమావేశాలకు డుమ్మా కొట్టడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రోజా తన మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపు చట్టం వేటు పడకుండా వుండే విధంగా తగినంత సంఖ్యాబలంతో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరనున్నారన్న ప్రచారం జరుగుతోంది. దానికోసం జగన్ ధోరణితో విసిగిపోయి పార్టీ మారడానికి సిద్ధంగా వున్న ఎమ్మెల్యేలతో రోజా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారిన అనంతరం రోజాకి ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం వుందన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.