జగన్ ‘బఫూన్’పై అసెంబ్లీలో గొడవ...

 

వైఎస్సార్సీపీ నాయకుడు, గౌరవనీయ ప్రతిపక్ష సభ్యుడు అయిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో తెలుగుదేశం నాయకులను ‘బఫూన్లు’ అనడం మీద వివాదం పెరుగుతోంది. శుక్రవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జగన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘బఫూన్లు’ అనే పదం మీద స్పీకర్ సూచించినట్టుగా జగన్ సారీ చెబుతారని అందరూ భావించారు. అయితే జగన్ సారీ చెప్పకపోగా తన వ్యాఖ్యలని సమర్థించుకున్నారు. జగన్ మీద తెలుగుదేశం నాయకులు ఉవ్వెత్తున విరుచుకుపడినప్పటికీ జగన్ లైట్‌గా తీసుకుని తన ధోరణిని కొనసాగించారు. కాగా శనివారం నాడు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ‘బఫూన్’ వ్యాఖ్యల మీద వివాదం కొనసాగింది. తెలుగుదేశం సభ్యులు జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అయితే జగన్ గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ ఈ విషయంలో క్షమాపణ చెప్పే ధోరణిని కనబరచలేదు. సభలో గందరగోళం జగడంతో 10 గంటల 15 నిమిషాలకు స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.