పంచాయతీలకే నిధులు కరువు.. ఇక కొత్త జిల్లాలకు..?
Published on: Mon Apr 4, 2022 2:51PM
పంచాయతీరాజ్ వ్యవస్థలోని చిట్టచివరి వ్యవస్థకు కూడా జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ శఠగోపం పెట్టేసింది. ఏపీలో పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులన్నింటినీ గోకేసి ఖాళీ చేసేసింది. ఆయా గ్రామ సర్పంచ్ లకు తెలియకుండా, వారి నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే చాప కింద నీరులా నిధులన్నింటినీ లాగేసుకుంది. గ్రామ పంచాయతీలకు పన్నుల రూపంలో వసూలయ్యే నిధులతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అందే నిధుల్ని కూడా జగన్ రెడ్డి సర్కార్ మొత్తం ఊడ్చేసిందట. ఆర్థిక సంఘం నిధుల్ని వైసీపీ సర్కార్ విద్యుత్ చార్జీల బకాయిల కింద విద్యుత్ సంస్థలకు ఇప్పటికే పంపిణీ చేసేసింది. సర్కార్ కుట్రపూరిత చర్యతో ఏపీలోని అనేక పంచాయతీలు ఇప్పుడు ‘నిధులో రామచంద్రా’ అంటూ విలవిల్లాడుతున్నాయి. ఓట్లు వేసి తమను సర్పంచ్ గా గెలిపించుకున్న గ్రామ ప్రజలకు కనీస అవసరాలు తీర్చేందుకు కూడా నిధులు లేక సర్పంచ్ లు వైసీపీ సర్కార్ పై కోపం, కసి, బాధతో రగిలిపోతున్నారు.
నిజానికి ఎండలు మండిపోతున్న ఈ వేసవి కాలంలో గ్రామాల్లోని ప్రజలు తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. అలాంటి చోట్ల చెడిపోయిన బోర్లకు మరమ్మతులు చేయించాలన్నా, పాడైన పైపులైన్లు బాగు చేయాలన్నా నిధులు లేక గ్రామాల సర్పంచ్ లు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. అసలే కష్టకాలంలో ఉన్న పంచాయతీల నుంచి నిధుల్ని మళ్లించుకుపోతే తామెలా గ్రామ సమస్యలు పరిష్కరించాలని లబోదిబోమంటున్నారు ఆయా గ్రామాల సర్పంచ్ లు.
అధికారమే పరమావధిగా భావించిన వైఎస్ జగన్ గత ఎన్నికల ముందు ముందూ వెనుకా చూడకుండా ఏపీ ప్రజలకు నోటికి వచ్చిన హామీ ఇచ్చారు. వాటిని ‘నవరత్నాలు’ అంటూ ఓ చట్రంలో బిగించారు. అనాలోచితంగా రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసిన జగన్ సర్కార్ కు చివరికి ఆ నవరత్నాలను అమలు చేయడం కూడా గగనంగా మారింది. దీంతో ఆశ్రిత పక్షపాతం, వందిమాగధులకు పప్పు బెల్లాల్లా పంపకాలు చేయడంలో నిమగ్నమైన వైసీపీ సర్కార్ కు కళ్లు తెరిచి చూసే సరికే ఖజానా ఖాళీగా దర్శనం ఇచ్చింది. దీంతో దొరికిన చోటల్లా అప్పులు తెచ్చింది. ఓడీలు వాడేసింది. బాండ్లను వేలం పెట్టి మరి తాకట్టు పెట్టింది. ఇకపై ఎక్కడా అప్పు గానీ, డబ్బులు గానీ ముట్టే పరిస్థితి లేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ వివిధ శాఖల్లోని నిధులను తమకు మళ్లించాలని ఆయా విభాగాల అధిపతులను ఆదేశించింది. అప్పటికీ కరువు తీరక చివరికి కొద్దో గొప్పో ఉండే పంచాయతీల నిధులకు కూడా ఎసరు పెట్టేయడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామ సర్పంచ్ ల ఖాతాల నుంచి జగన్ రెడ్డి సర్కార్ వేల కోట్ల రూపాయలు రాజ్యాంగ విరుద్ధంగా తీసేసుకుందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీ రాజేంద్రప్రసాద్ మండిపడుతున్నారు. అలా ఏప్రిల్ 1వ తేదీన ఏపీలోని 12 వేల 918 గ్రామా పంచాయతీల నుంచి ఏపీ సర్కార్ నిధులు లాగేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. పంచాయతీల నుంచి తీసుకున్న నిధులను జగన్ సర్కార్ సొంత అవసరాలకు వాడేసుకుందనేది రాజేంద్రప్రసాద్ ఆరోపణ.
పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఛాన్స్ లేదని ఆర్థిక రంగ నిపుణులు అంటుండడం ఇక్కడ గమనార్హం. అయితే.. జగన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక పర్సనల్ ఖాతాల రూపంలో ఓ వెసులుబాటును కల్పించుకుందంటున్నారు. పర్సనల్ ఖాతాల ప్రకారం ఏపీలోని పీడీ ఖాతాలన్నీ రాష్ట్ర ఆర్థికశాఖ నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఆర్థికశాఖ కార్యదర్శి మాత్రమే ఈ ఖాతాల్లోని నిధులు తీసుకునే వెసులుబాటును వైసీపీ సర్కార్ తీసుకొచ్చిందట. ఈ వెసులుబాటును ఉపయోగించుకునే పంచాయతీల్లోని నిధులను జగన్ సర్కార్ గోల్ మాల్ చేసిందంటున్నారు.
ఇలా గత డిసెంబర్ నెలలో కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని వైసీపీ సర్కార్ లాగేసిందట. తర్వాత మార్చి 31న మరోసారి పంచాయతీల ఖాతాల్లోని నిధులు తీసుకుందట. గ్రామ సర్పంచులు, పంచాయతీల కార్యదర్శులకు ఏ మాత్రం తెలియకుండా ఆయా ఖాతాల్లోని మొత్తం నిధులను పైసా కూడా లేకుండా తీసేసిందని రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
మొత్తానికి ఒక్క చాన్స్ అంటూ అధికార పీఠం ఎక్కిన జగన్ రెడ్డి ఏపీలోని ఏ ఒక్క విభాగాన్నీ, ఏ ఒక్క శాఖను కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. నిధులన్నీ జగన్ సర్కార్ ఎత్తుకుపోవడంతో పంచాయతీ సిబ్బంది జీతాలను గత కొన్ని నెలలుగా తామే చెల్లించాల్సి వస్తోందని పలువురు సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.


